స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ..దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతుంది

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ..దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతుంది
  •  అంబేద్కర్ అంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం
  • గాంధీ, బ్రిటీషర్లతో కొట్లాడిన ఘనత అంబేద్కర్ ది
  • మాతా రమాబాయి జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

హైదరాబాద సిటీ, వెలుగు: దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా ఇంకా కుల వివక్ష ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని, జై భీం స్లోగన్ చెప్తుంటే అంబేద్కర్ గుర్తుకొస్తారని తెలిపారు. 

పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మాతా రమాబాయి జయంతి ఉత్సవాల్లో వివేక్​పాల్గొని మాట్లాడారు. ‘అంబేద్కర్ ఆత్మ విశ్వాసమున్న వ్యక్తి. పేద ప్రజల పక్షాన నిలిచిన మహనీయుడు. ఆయనే మనకి ధైర్యం. మహిళల హక్కులు, కార్మికుల హక్కుల కోసం కొట్లాడారు. 

నాడు కుల వివక్ష ఉన్నా.. జాతి కోసం అంబేద్కర్ నిలబడ్డారు. గాంధీ, బ్రిటీష్ వారితో కొట్లాడిన ఘనత అంబేద్కర్​కే దక్కుతుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో చాలా మంది కృషి ఉంది. అప్పటి ప్రభుత్వం అడ్డంకులు పెట్టినా విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. హక్కుల సాధనకు అందరూ ఐక్యంగా పోరాడాలి’ అని వివేక్​చెప్పారు. 

అనంతరం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ఓర్పు, సహనానికి రమాబాయి నిదర్శనం అన్నారు. అంబేద్కర్​కష్టాల్లో ఉన్నప్పుడు వెంట ఉండి నడిపించిందన్నారు. అంబేద్కర్ అందరివాడని, ఒక కులానికి అంటగట్టొద్దని కోరారు. 

రాజేంద్రనగర్​ సర్కిల్​లో ..

గండిపేట: జైభీమ్‌‌.. జై రామ్‌‌ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజేంద్రనగర్‌‌ సర్కిల్‌‌ లో మాతా రమాబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్​విగ్రహం వద్ద రమాబాయి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిటీ అధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి ఎడ్లకాడి సూర్యం, మాజీ అధ్యక్షుడు పంబాల రాజు, చంద్రశేఖర్, అడ్వైజర్‌‌ వి.శ్రీరాములు, గొడుగు సంజీవ, వీర్లపల్లి నవీన్, బండి నర్సింహ, గోల్కొండ ఉపేందర్, ఎడ్లకాడి చంద్రశేఖర్, సుమన్, కనకమామిడి ప్రవీణ్, నర్సింహ, కొత్తపల్లి సంతోశ్, శంకర్, చాంది, జేమ్స్‌‌ తదితరులు పాల్గొన్నారు.