
వరంగల్సిటీ, వెలుగు : జీడబ్లూఎంసీ పరిధిలో పర్మిషన్ లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనొద్దని మేయర్ గుండు సుధారాణి సూచించారు. అక్రమ లేఅవుట్లలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, ప్లానింగ్ ఆఫీసర్లతో సోమవారం బల్దియా ఆఫీస్లో నిర్వహించిన మీటింగ్లో ఆమె మాట్లాడారు. టీఎస్ బీపాస్ అప్లికేషన్లను పెండింగ్లో పెట్టకుండా 21 రోజుల్లోగా పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. అనుమతి లేని లేఅవుట్లు, బఫర్ జోన్లలో నిర్మించే భవనాలు, డీవియేషన్ల వివరాలపై అధికారులకు తెలియజేసి ప్రాథమిక దశలోనే తొలగించాలని సూచించారు. బఫర్ జోన్లలో నిర్మాణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లపైనే ఉందన్నారు. బల్దియా పరిధిలోని ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఇన్చార్జి అడిషనల్ కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్, బషీర్, సుష్మా పాల్గొన్నారు. అనంతరం బల్దియా హెడ్ ఆఫీస్లో నిర్వహించిన ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అలాగే 29వ డివిజన్ సుశీల్ గార్డెన్ సమీపంలో పర్యటించి మురుగునీరు రోడ్డు మీదకు చేరకుండా చూడాలని ఆదేశించారు. సుశీల్ థియేటర్ ప్రాంతంలో డ్రైనేజీలు నిర్మించాలని సూచించారు.