మెదక్ జిల్లాలో సమ్మర్​ యాక్షన్ ​ప్లాన్ అమలు చేయాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్ జిల్లాలో సమ్మర్​ యాక్షన్ ​ప్లాన్ అమలు చేయాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్ ​టౌన్, వెలుగు: జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలని ఇందిరమ్మ గృహ నిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్​ కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..వేసవికాలం పూర్తయ్యే వరకు తాగునీటి  సరఫరా అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రత్యేక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించి చర్యలు చేపట్టాలన్నారు.

ప్రత్యామ్నాయ పద్ధతులతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలన్నారు. ప్రతి గ్రామం నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితా విచారణకు గెజిటెడ్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు.  ప్రతి అధికారికి  200 మంది లబ్ధిదారుల జాబితా ఇస్తామన్నారు. ప్రతి రోజు కనీసం 25 మంది లబ్ధిదారుల విచారణ చేపట్టి   ప్రక్రియను 8 రోజుల్లో  పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్​నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, డీఆర్​వో భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఆర్​డబ్ల్యూఎస్,  మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.