
- మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు : ఉద్యానవన పంటలు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయిల్ పామ్, పంటల సాగుపై మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల రైతుబంధు కో-ఆర్డినేటర్లు , రైతులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరాలలో లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు.
లివింగ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేయడానికి ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ , ఇతర సన్న, చిన్న కారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తూ వారికి మొక్కలు, డ్రిప్, పరికరాలను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో మెదక్ జిల్లా ను మొదటిస్థానంలో నిలపాలని కోరారు.
రెండో విడత ‘దళితబంధు’ స్పీడప్ చేయాలి
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో రెండో విడత దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్లో తహసీల్దార్లు , ఎంపీడీవోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామ దళితవాడలో సర్వే పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన అందరికీ లబ్దిచేకూరేలా సర్వే నిర్వహించాలని సూచించారు. దళిత వికలాంగులకు మొదటి ప్రాధ్యాన్యతనివ్వాలని చెప్పారు. అందోల్, నారాయణఖేడ్, మెదక్ నియోజకవర్గాలలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలన్నారు.
సంపద వనాలతో జీపీకి బెన్ఫిట్
కొల్చారం, వెలుగు : సంపద వనాలతో ప్రతి గ్రామ పంచాయతీకి బెన్ఫిట్ వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మంగళవారం వెంకటాపూర్, చిన్నఘనపూర్లో సంపద వనాన్ని, కొల్చారంలో మన ఊరు మన బడి పనులను ఆయన పరిశీలించారు. ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం తనిఖీ చేసి, కేంద్రం ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందుతున్నాయో తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో ఈసారి 36 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ ఉండగా ఇప్పటికే 75 శాతం పూర్తి చేశామని చెప్పారు.
ఆగస్టు 15న 75 సంవత్సరాల స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం ఉందని, అందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో 750 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.