
- మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, దానిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం మెదక్ పట్టణంలోని డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్కు ఓటుపై అహగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ నమోదులో యువత చైతన్యం కావాలన్నారు. జిల్లాలో 73 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 15 రోజుల పాటు ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్ నమోదుకు ఆన్ లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఓటు నమోదు చేసుకోవచ్చునన్నారు. 18 ఏండ్లు నిండిన 200 మంది స్టూడెంట్స్ ఫారమ్- 6 పూరించి అక్కడే ఉన్న ఏఈఆర్వోకు అందజేశారు. అనంతరం డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో కలెక్టర్ మొక్క నాటారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెదక్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్, కాలేజీ ప్రిన్సిపాల్గణపతి తదితరులు పాల్గొన్నారు.
చెరువులను పరిశీలించాలి
మెదక్ జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలోని నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని చెరువులు, శిఖం భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు. నాలుగు మండలాల అధికారులు సర్వే రికార్డు ప్రకారం పరిశీలన చేసి ఏ చెరువు.. ఎంత ఉందనే రికార్డులు నమోదు చేసుకోవాలని సూచించారు.
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మెదక్ జిల్లా ఫొటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 19న ఫొటోగ్రఫీ వేడుకలు, వృత్తినైపుణ్య కార్యక్రమాల వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఫొటోగ్రాఫర్ల సంఘం ప్రెసిడెంట్ బిట్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శి గిర్ని ప్రభు గౌడ్, జిల్లా కోశాధికారి పొట్లచెరువు నాగరాజు, బస్వరాజు, విఘ్నేశ్, గిరి, శ్రీకాంత్, రంజిత్, కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.