
- బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి
- బీజేపీని విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదు
- మెదక్ ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్
గజ్వేల్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ టౌన్ లో భారతీయ జన ఔషధీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకురాలు కవిత బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఇద్దరు గెలిస్తే ఒకరు బీసీ, మరొకరు ఓసీ వ్యక్తి అని చెప్పారు. దేశంలో బీసీలకు నిజమైన న్యాయం బీజేపీతోనే జరుగుతుందని పేర్కొన్నారు. బీసీలకు ఎవరైనా అన్యాయం చేశారంటే అది బీఆర్ఎస్ సే అని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కవిత కుటుంబ సభ్యులే పదవులన్నీ అనుభవించారని విమర్శించారు.
కేసీఆర్ తొలిసారి పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రిమండలిలో చోటు ఇవ్వకుండా దేశంలోనే రికార్డు సృష్టించారని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా బీసీలకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోవటానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా బీసీలకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.