
- నేలపై కూర్చొని నిరసన.. సభ నుంచి వాకౌట్ చేసిన నిజాంపేట జడ్పీటీసీ
- అధిరుల తీరుపై నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఆగ్రహం
మెదక్, వెలుగు : ప్రశ్నలు, విమర్శలు, వాదోపవాదాలతో మెదక్ జడ్పీ జనరల్బాడీ మీటింగ్ వాడివేడిగా జరిగింది. సోమవారం చైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగిన మీటింగ్లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పాల్గొన్నారు. బీజేపీకి చెందిన నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్కుమార్మాట్లాడుతూ మెదక్ లో రైల్వే రేక్ పాయింట్ ఓపెన్ చేసి వసతులు సమకూర్చక పోవడంతో కేవలం ఒక్కసారి మాత్రమే ఎరువుల స్టాక్ వచ్చిందని తెలిపారు. మన ఊరు మన బడి కింద పనులు చేసినా బిల్లులు రావడంలేదన్నారు.
నిజాంపేట ప్రైమరీ స్కూల్కు రూ.1.80 కోట్లు మంజూరైనా కాంట్రాక్టర్లను రానివ్వకపోవడంతో పనులు మొదలు కాలేదని చెప్పారు. మెదక్ నుంచి వుమెన్స్ డిగ్రీ కాలేజీ తరలిపోయినా పట్టించుకునే వారు లేరని విమర్శించారు. ఆఫీస్ లకు బిల్డింగులు అద్దెకు ఇప్పిస్తే కిరాయి రాకపోవడంతో ఓనర్లు తమ ఇంటికి వచ్చి కూర్చుంటున్నారని, ఇప్పుడు మళ్లీ కేజీబీవీకి బిల్డింగ్చూడమనడం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటైన నిజాంపేట మండల కేంద్రంలో పీహెచ్సీ ఏర్పాటు విషయంలో మాటలే తప్ప పనులు జరగడం లేదన్నారు.
ఇలా నిజాంపేట జడ్పీటీసీ విజయ్ కుమార్ అన్ని డిపార్ట్మెంట్ చర్చల్లో అధికారులను నిలదీయడం, ప్రశ్నిస్తుండటంతో వెల్దుర్తి బీఆర్ఎస్ జడ్పీటీసీ రమేశ్గౌడ్, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, కోఆప్షన్ మెంబర్ యూసుఫ్ తదితరులు అభ్యంతరం తెలిపారు. ‘అన్ని అంశాల్లో నువ్వే జోక్యం చేసుకుంటూ చాలా సేపు మాట్లాడటం ఏంటి? సభలో అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి’ అంటూ అడ్డు చెప్పారు. దీంతో అటు విజయ్ కుమార్కు, ఇటు బీఆర్ఎస్ జడ్పీటీసీ, ఎంపీపీలకు మధ్య వాగ్వాదం జరిగింది.
జడ్పీటీసీ విజయ్ కుమార్ ప్రశ్నలపై ఎమ్మెల్సీ యాదవరెడ్డి స్పందిస్తూ గతంలో యూరియా కోసం చెప్పులు క్యూలైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యే లేదన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రతిది నెగెటివ్ గా తీసుకోవద్దని, సమస్య ఏదైనా ఉంటే సంబంధిత డిపార్ట్మెంట్చర్చ వచ్చినప్పుడు చెప్పాలన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ లేచి నిజాంపేట జడ్పీటీసీ విజయ్ కుమార్ తీరుపై అభ్యంత్రం వ్యక్తం చేశారు.
దీంతో విజయ్ కుమార్ అధికార పార్టీకి చెందిన సభ్యులు సభలో తన గొంతు నొక్కేస్తున్నారంటూ కుర్చీలో నుంచి లేచి సభా వేదిక ముందు కింద కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి బయటికి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే ఫైర్....
పనులు, బిల్లుల విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, డీపీఓ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనులు కావడం లేదన్నారు. తన పరిధిలో ఈ ఆఫీసులు ఉండి ఉంటే లీవ్ పెట్టి వెళ్లిపొమ్మనే వాడినని, లేదంటే కొట్టి వెళ్లగొట్టాలన్నంత కోపం వస్తోందని పంచాయతీరాజ్ ఈఈ, డీపీఓలను ఉద్దేశించి అన్నారు. ‘ఎమ్మెల్యే అయిన నేను కాకుండా నారాయణఖేడ్ నుంచి ఇంకెవరైనా ఫోన్ చేసి చెప్పాల్నా మీకు.
నేను ఈ రోజు మీ ఇద్దరిని క్లాస్ తీసుకునేందుకే జడ్పీ మీటింగ్కు వచ్చాను, మీరు రాజకీయం చేయదలచుకుంటే ఉద్యోగానికి రిజైన్ చేసి చేయండి’ అంటూ డీపీఓ సాయిబాబాపై మండి పడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలు గైర్హాజరు జడ్పీ మీటింగ్కు జిల్లా మంత్రి హరీశ్ రావు, మెదక్, నర్సాపూర్, అందోల్, చేగుంట ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, రఘునందన్ రావు గైర్హాజర్ అయ్యారు. మూడు నెలలకు ఒకసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్కు ఎమ్మెల్యేలు రాకపోవడం చర్చనీయాంశమైయింది.