
న్యూఢిల్లీ: వార్తలు, అభిప్రాయాలు, స్టేట్ మెంట్లను ప్రచురించే ముందు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు సూచించింది. మీడియాలో వచ్చే వార్తలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వ్యక్తుల పేరుప్రతిష్టలకు నష్టం చేయగలవని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన బెంచ్ పేర్కొంది. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో మీడియా పాత్ర చాలా కీలకమని వ్యాఖ్యానించింది. భావప్రకటన స్వేచ్ఛ అత్యంత ప్రధానమైనదని పేర్కొంటూనే.. ప్రముఖ ఇంగ్లిష్ డైలీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ డైరెక్టర్, ఇతర జర్నలిస్టులపై దాఖలైన పరువునష్టం దావాను కొట్టివేసింది.
బిడ్ అండ్ హ్యామర్ ఫైన్ ఆర్ట్స్ ఆక్షనీర్లు వేలం వేయాల్సిన కొన్ని పెయింటింగ్స్ పై ఆ డైలీ ఎడిటోరియల్ డైరెక్టర్, జర్నలిస్టులు అభ్యంతరకరమైన ఆర్టికల్ పబ్లిష్ చేశారని గతంలో కర్నాటక హైకోర్టులో పరువునష్టం కేసు నమోదైంది. తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చర్యలు తీసుకోకుండా ఆ కేసును కొట్టివేయాలని జర్నలిస్టులు పిటిషన్ వేయగా.. హైకోర్టు కొట్టివేసింది. దీంతో, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది.