హైదరాబాద్: మీర్ పేట్ వెంకట మాధవి హత్య కేసులో మరో సంచలన కోణం వెలుగుచూసింది. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానిస్తున్నారు. ఒక మహిళతో పాటు మరో ఇద్దరి పాత్ర ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
గురుమూర్తిని కోర్టు అనుమతితో పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. గురుమూర్తిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురుమూర్తికి సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే గురుమూర్తి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అవసరమైతే గురుమూర్తికి పాలీ గ్రాఫ్ టెస్టులు నిర్వహించాలని పోలీసుల భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పరిధిలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు. తర్వాత వాటిని తీసుకువెళ్లి సమీపంలోని డ్రైనేజీలో పడేశాడు. బొక్కలను కాల్చి పొడి చేసి చెరువులో కలిపాడు. జనవరి16, 2025న ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు బిడ్డలు. పెద్ద కుమార్తె వెంకటమాధవి(35)ని13 ఏండ్ల కింద అదే జిల్లాకు చెందిన గురుమూర్తికి ఇచ్చి పెండ్లి జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్తీసుకున్నాడు. తర్వాత కంచన్బాగ్డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మీర్ పేట్ పీఎస్పరిధి జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు.
కొన్నాళ్ల నుంచి గురుమూర్తి తన భార్య వెంకటమాధవిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఈ నెల16వ తేదీన భార్యతో గొడవపడిన గురుమూర్తి.. తర్వాత తన భార్య కనిపించడం లేదని అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. తనతో గొడవ పడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఒక్కడే వెళ్లి మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి ఎదురుగా, పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
అందులో 16వ తేదీన గాని, ఆ తర్వాత గాని.. వెంకటమాధవి ఎక్కడా బయటకు వెళ్లినట్టుగాని, లోపలకు వచ్చినట్టు గాని కనిపించలేదు. పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత వెంకటమాధవి అత్తతో ఫిర్యాదు తీసుకుని సీసీటీవీ ఫుటేజీల గురించి గురుమూర్తికి చెప్పి ప్రశ్నించారు. ఇక కేసు నుంచి బయటపడలేనని అర్థమైన గురుమూర్తి..తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.