Megastar Chiranjeevi: దర్శకులకు చిరంజీవి ఛాలెంజ్..కలిసి నటించేందుకు రెడీ, కథ రెడీ చేయండి

Megastar Chiranjeevi: దర్శకులకు చిరంజీవి ఛాలెంజ్..కలిసి నటించేందుకు రెడీ, కథ రెడీ చేయండి

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న  సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లో ఆదివారం  స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

చిరంజీవి (Chiranjeevi)మాట్లాడుతూ ‘ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నా.  ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది.  తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ‘సమర సింహా రెడ్డి’ స్ఫూర్తితోనే నేను ‘ఇంద్ర’ సినిమా చేశా. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. అందుకు తగ్గ కథ రెడీ చేయాలని దర్శకులకు ఛాలెంజ్ ఇస్తున్నా. మేమంతా ఒక్కటే అనేలా.. ఫ్యాన్స్ కోసం  హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియజేసేలా ఈ వేడుక జరిగింది’ అని అన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ‘నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులను, ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన ప్రేక్షకులను  నా గుండెల్లో పెట్టుకుంటా. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంతా కలిసి ఈ వేడుకను విజయవంతం చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు. చలన చిత్ర పరిశ్రమలోని మా మధ్య ఒక ఆరోగ్యకరమైన  పోటీ మాత్రమే ఉంటుంది’ అని చెప్పారు.బాలకృష్ణ 50 ఏండ్ల సినీ ప్రయాణం కొత్త వారెందరికో ఆదర్శం అన్నారు వెంకటేష్.

ఈ కార్యక్రమంలో హీరోలు గోపిచంద్, శ్రీకాంత్, రానా, నాని, అల్లరి నరేష్, మంచు విష్ణు, మంచు మనోజ్, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ,  కన్నడ హీరోలు శివ రాజ్‌‌‌‌కుమార్, ఉపేంద్ర,  దర్శకులు రాఘవేంద్రరావు,  బోయపాటి శ్రీను, బి గోపాల్, అనిల్ రావిపూడి, బుచ్చిబాబు,  వైవీఎస్ చౌదరి, రైటర్ విజయేంద్ర ప్రసాద్,  నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం, జీవిత రాజశేఖర్, సుహాసిని, ఇంద్రజ, మాలశ్రీ, సుమలత,  నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, అభిషేక్ అగర్వాల్, సుధాకర్ చెరుకూరి, రవి శంకర్  తదితరులు పాల్గొన్నారు.