స్కిల్స్‌‌ వర్సిటీకి మేఘా కంపెనీ రూ.200 కోట్లు

స్కిల్స్‌‌ వర్సిటీకి మేఘా కంపెనీ రూ.200 కోట్లు
  • భవన నిర్మాణానికి సీఎస్‌‌ఆర్‌‌‌‌ కింద నిధుల కేటాయింపు
  • వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇస్తామన్న కంపెనీ 
  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒప్పందం కుదుర్చుకున్న ఎండీ కృష్ణారెడ్డి

హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది.

మొత్తం వర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌‌ఆర్‌‌‌‌) ఫండ్స్‌‌ నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. అలాగే, వర్సిటీ క్యాంపస్‌‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతను కూడా స్వీకరించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్‌‌ వర్సిటీ నిర్మాణం చేపట్టేందుకు కంపెనీ ముందుకొచ్చింది.

సెక్రటేరియెట్‌‌లో శనివారం సీఎం రేవంత్ రెడ్డితో మేఘా ఎండీ కృష్ణారెడ్డి, ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్‌‌ వర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడ్తామని మేఘా కంపెనీ తెలిపింది. వర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. సీఎస్‌‌ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌‌ రంజన్, వర్సిటీ వైస్ చాన్స్‌‌లర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.

మేఘాకు సీఎం అభినందనలు..
సీఎస్ఆర్ నిధులతో స్కిల్స్‌‌ యూనివర్సిటీ నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకు రావడంపై సీఎం రేవంత్‌‌ రెడ్డి అభినందనలు తెలిపారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ కూడా నిర్మిస్తామని కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే తయారు చేయించిన వర్సిటీ భవన నిర్మాణ నమూనాలను ఈ సమావేశంలో ప్రదర్శించారు.