రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కృషి చేస్తా

 రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కృషి చేస్తా

ఆమనగల్లు, వెలుగు: రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కు తన వంతు కృషి చేస్తానని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు,  నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. శనివారం  అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తో కలిసి నాగర్ కర్నూల్ పర్యటనకు వెళ్తున్న ఆయన కడ్తాల్ మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

సామాజిక తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు.  ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. అనంతరం ఎంపీని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బిఖ్య నాయక్, యాట నరసింహ, లక్ష్మయ్య, రామకృష్ణ, రామ్ చందర్ నాయక్, అద్దాల రాములు, భాస్కర్ రెడ్డి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.