స్వదేశీ సంస్థానాల విలీనం

స్వదేశీ సంస్థానాల విలీనం

స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో  బ్రిటిష్​ వారు ప్రత్యక్షంగా పాలించిన ప్రాంతాలను బ్రిటిష్​ ఇండియా అని, స్వదేశీ రాజు పాలనలోని ప్రాంతాలను స్వదేశీ సంస్థానాలు అనేవారు. 1947 నాటికి 562 సంస్థానాలు ఉండేవి. ఇందులో 559 సంస్థానాలు భారత్​లో కానీ పాకిస్తాన్​లో కానీ విలీనం కాగా, మిగిలిన జునాగఢ్​, కశ్మీర్​, హైదరాబాద్​ సంస్థానాలు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నాయి. వీటిని భారతదేశంలో విలీనం చేసేందు కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టింది. ప్రజాభిప్రాయ సేకరణతో జునాగఢ్​ విలీనం కాగా, సైనిక చర్యతో కశ్మీర్​, హైదరాబాద్​ సంస్థానాలు భారతదేశ నియంత్రణలోకి వచ్చాయి. 

జునాగఢ్​: కథియావాడ్​లోని జునాగఢ్​ ప్రాంతం 1807 నుంచి బాబి వంశం ఆధీనంలో ఉంది. ఈ వంశ స్థాపకుడు మహ్మద్​ షేర్​ఖాన్​ బాబి. ఈ ప్రాంతాన్ని 1911–1948 వరకు పాలించిన నవాబు మహ్మద్​ మహబ్బత్​ ఖాన్​–3. ఇతని ప్రధాని షానవాజ్​ భుట్టో. ఇక్కడ హిందువుల జనాభా ఎక్కువ (75%). వీరంతా జునాగఢ్​ ఇండియాలో విలీనం కావాలని కోరుకున్నారు. కానీ నవాబ్​ భారత స్వాతంత్ర్యం పొందే నాటికి జునాగఢ్​ పాకిస్తాన్​లో విలీనం అవుతున్నట్లు ప్రకటించాడు. దీంతో కాంగ్రెస్​ నాయకత్వంలో ప్రజా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ధేబర్​, బల్వంత్​రాయ్​ మెహతా, శ్యామల్​దాస్​ గాంధీ, రసీఖ్​లాల్​ పాల్గొన్నారు. శ్యామల్​దాస్​ జునాగఢ్​లో పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమని ప్రకటించి బొంబాయి నుంచి రాజ్​కోట్​ వరకు జైత్రయాత్రను జరిపాడు. 1947, నవంబర్​ 7న భారత సైన్యాలు జునాగఢ్​ను ఆక్రమించాయి. పాలనా యంత్రాంగాన్ని పునర్​ వ్యవస్థీకరించడానికి ప్రభుత్వం 
ఎస్​.డబ్ల్యూ.శివేశ్వరార్కర్​ను నియమించింది. 1948, జనవరి 20న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణను అనుసరించి జునాగఢ్​ భారత్​ వశమైంది. 

కశ్మీర్​: 1846లో జరిగిన లాహోర్​ సంధి ప్రకారం సిక్కులు మొదటి ఆంగ్లో – సిక్కు యుద్ధానికి నష్టపరిహారంగా బ్రిటిష్​ వారికి కశ్మీర్​ను ధారాదత్తం చేశారు. ఆ తర్వాత మహారాజా గులాబ్​సింగ్​ బ్రిటిష్​ వారి నుంచి కశ్మీర్​ను కొనుగోలు చేశాడు. 1941 బ్రిటిష్​ జనాభా సెన్సెస్​ ప్రకారం కశ్మీర్​లో ముస్లిం జనాభా 77%, హిందూ జనాభా 20%గా ఉంది. స్వాతంత్ర్యం నాటికి కశ్మీర్​ పాలకుడైన మహారాజా హరిసింగ్​ కశ్మీర్​ను భారత్​లో కానీ, పాకిస్తాన్​లో కానీ విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉంచాడు. కశ్మీర్​ ప్రజలు షేర్​–ఏ–కశ్మీర్​గా పిలిచే షేక్​ అబ్దుల్లా నాయకత్వంలో భారతదేశంలో విలీనం కావాలని కోరారు. ఇతను 1932లో నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీని స్థాపించాడు. 1946లో హరిసింగ్​కు వ్యతిరేకంగా క్విట్​ ఉద్యమాన్ని షేక్​ అబ్దుల్లా ప్రారంభించాడు. 

విలీనంపై సంతకం

కశ్మీర్​లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని పాకిస్తాన్​ కోరింది. 1947, అక్టోబర్​లో పాకిస్తాన్​ సైన్యం కశ్మీర్​లోకి చొరబడి ఆక్రమించడానికి ప్రయత్నించింది. దీంతో హరిసింగ్​ భారత్ సహాయాన్ని కోరాడు. 1947, అక్టోబర్​ 26న భారత్​లో కశ్మీర్​ విలీనానికి సంబంధించి హరిసింగ్​ అంగీకార ఒప్పంద పత్రంపై సంతకం చేశాడు. రాజా హరిసింగ్​, జవహర్​లాల్​ నెహ్రూ మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా రాజా హరిసింగ్​, భారత్​ సైన్యాల సహాయంతో పాకిస్తాన్​ సైన్యంతో పోరాడాడు. దీంతో పాకిస్తాన్​, భారత్​ మధ్య యుద్ధం జరిగింది. ప్రాణ, ఆస్తి నష్టం అధికంగా జరగడంతో యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ జవహర్​లాల్​ నెహ్రూ కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్య సమితిని కోరాడు. యూఎన్​ఓ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అంతేగాక ఏడాదిలోపు కశ్మీర్​లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ఆదేశించింది. పాకిస్తాన్​ సైన్యం ఆక్రమించిన వాయవ్య కశ్మీర్​ పాకిస్తాన్​లో ఆధీనంలో ఉండిపోయింది. 

హైదరాబాద్​

భారత స్వాతంత్ర్యం నాటికి హైదరాబాద్​ నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఆధీనంలో ఉండేది. ఇతని ప్రధాని ఛత్తారి నవాబు. 1947, ఆగస్టు 15 నాటికి హైదరాబాద్​ భారత్​లో విలీనం కాలేదు. తాను స్వతంత్రంగా ఉంటానని ఏడో నిజాం 1947, ఆగస్టు 27న ఒక ఫర్మానా జారీ చేశాడు. అదే సమయంలో మౌంట్​బాటన్​తో చర్చలు జరపడానికి నిజాం ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాడు. ఢిల్లీలో చర్చలు విఫలమైతే తాను పాకిస్తాన్​లో విలీనం అవుతానని నిజాం హెచ్చరించాడు. చివరికు 1947, నవంబర్​ 29న నిజాం యథాతథ స్థితి ఒప్పందంపై సంతకం చేశాడు. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించింది హైదరాబాద్​ ప్రధాని ఛత్తారి నవాబు. రజాకార్ల నాయకుడైన కాశీం రజ్వీ ఒత్తిడితో నిజాం లాయక్​ అలీని ప్రధానిగా చేశాడు. యథాతథాస్థితి ఒప్పందంపై సంతకం చేసిన నిజాం దానిని పాటించక భారత్​కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నాడు. గోల్కొండ, చాదర్​ఘాట్​, మోతీమహల్​లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్​లో రజాకార్ల అకృత్యాలు ఎక్కువవడంతో శాంతిభద్రతలు క్షీణించాయి. 

పోలీస్​ చర్య

యథాతథ స్థితి ఉల్లంఘించినందుకు అప్పటి హైదరాబాద్​ సంస్థానంలో భారత దేశ సంస్థానాల వ్యవహారాల కార్యదర్శి వి.పి.మీనన్​ను నిజాంతో సంప్రదింపులకు పంపింది. లాయక్​ అలీ తమది స్వతంత్ర దేశం కావున ఆయుధాలు సమకూర్చుకునే హక్కు ఉందని పేర్కొన్నాడు. అంతేకాక కాశీం రజ్వీ 1948, ఏప్రిల్​ 8న అసఫ్​జాహి జెండాను ఎర్రకోటపై ఎగురవేస్తాను అని పేర్కొన్నాడు. 

హైదరాబాద్​లో రజాకార్ల అకృత్యాలు అధికం కావడంతో దీంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం నిజాంను లొంగదీసుకోవడానికి 1948, సెప్టెంబర్​ 13న సైనిక చర్య చేపట్టింది. సెప్టెంబర్​ 13–17 మధ్య జరిగిన సైనిక చర్యలో నిజాం సైన్యాలు ఓడిపోవడంతో మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. 1948, సెప్టెంబర్​ 18న జేఎన్​ చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ప్రభుత్వం ఏర్పడింది.