
హైదరాబాద్ లో ట్రాఫిక్ ను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలో ఉండే వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు పైవంతెనల (స్కైవాక్స్) నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఏవైనా ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్ల నుంచి ఇటువంటి స్కైవాక్ లు నిర్మించాలనుకుంటే వాళ్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ స్టేషన్ రిటైల్ అధికారి కె.వి. నాగేంద్ర ప్రసాద్ ఫోన్ నెంబర్ 9900093820 కు కాల్ చేయొచ్చని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు
69 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్ మెట్రో మొదటి దశకు చెందిన మొత్తం 57 స్టేషన్లలో ప్రతి స్టేషన్ రెండు వైపులా రోడ్డుకు ఒక వైపు నుంచి మరో వైపునకు చేరుకునే సౌకర్యం ఉందని, వీటిని మెట్రో ప్రయాణీకులే కాక, అన్-పెయిడ్ మార్గాలుగా ఏ పాదచారులైన వినియోగించుకోవచ్చని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. వీటిని వినియోగించుకుని ప్రమాదాల బారిన పడకుండా రోడ్డును సురక్షితంగా దాటాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read :- వరస నష్టాల్లో స్టాక్ మార్కెట్.. అయితే లాభపడ్డ స్టాక్స్ ఇవే
ఇప్పటికే ఎల్ అండ్ టీ పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుండి వారు అభివృద్ధి చేసే మాల్స్ కు పైవంతెనలు నిర్మించి మెట్రో ప్రయాణీకులు నేరుగా ఈ వాణిజ్య సముదాయాలకు చేరుకునే సౌలభ్యాన్ని కల్పించింది. అదే విధంగా జేబీఎస్, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్ లను కలుపుతూ ప్రయాణీకులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్ లు నిర్మించింది. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్ లో 11 టవర్లలో నెలకొని ఉన్న అనేక అంతర్జాతీయ సంస్థలలో పనిచేస్తున్న వారు సులభంగా చేరుకునే విధంగా రహేజా వారు ఒక అధునాతనమైన స్కైవాక్ ని అనేక సౌకర్యాలతో నిర్మించింది
ఉప్పల్ మెట్రో స్టేషన్ ను ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న అన్ని రస్తాలను కలిపే విధంగా హెచ్ఎండీఏ నిర్మించిన వలయాకారపు రోటరీ స్కైవాక్ మెట్రో ప్రయాణీకులకు, ఈ కూడలి రోడ్లు దాటే పాదచారులకు బాగా ఉపయోగపడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ల నుండి స్కైవాక్ నిర్మాణం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీనికి వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి ఇతర నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల వాళ్ల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్/ల్యాండ్ మార్క్ మాల్ కు ఆ సంస్థ వారే స్కైవాక్ నిర్మిస్తున్నారు. అలాగే ఎల్ బీ నగర్ స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనందనిలయం నివాస భవనాల సముదాయానికి వాసవీ గ్రూప్ వారు స్కైవాక్ నిర్మిస్తున్నారు. వాసవీ ఆనంద నిలయం కాంప్లెక్స్ మొత్తం 25 ఎకరాలలో ఒక్కొక్క టవర్ లోను 33 అంతస్తులతో మొత్తం 12 టవర్స్ నిర్మించబడుతున్నాయి. వాటిలో పెద్ద సంఖ్యలో నివసించబోతున్న అనేక కుటుంబాలకు ఈ స్కైవాక్ చక్కటి సౌకర్యం కల్పిస్తుంది. అదే విధంగా మరికొన్ని సంస్థలు నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్ పల్లి వంటి అనేక మెట్రో స్టేషన్ల నుంచి ఈ తరహా స్కైవాక్ లు నిర్మించడానికి తమతో చర్చలు జరుపుతున్నారని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ,సీఈవో కేవీబీ రెడ్డి అన్నారు.