నల్లా బిల్లులు కట్టనోళ్లకు వన్​టైం సెటిల్​మెంట్

నల్లా బిల్లులు కట్టనోళ్లకు వన్​టైం సెటిల్​మెంట్
  • ఒకేసారి చెల్లిస్తే లేట్​ ఫీజు, వడ్డీ మాఫీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్ పరిధిలోని నీటి వినియోగదారులకు మెట్రోవాటర్ బోర్డు శుభవార్త చెప్పింది. బకాయిలు ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోపు ఎటువంటి వడ్డీ, ఆలస్య రుసుం లేకుండా వన్​టైం సెటిల్​మెంట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటర్​బోర్డుపై బకాయిల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీఎస్ అమలు చేయాలని నిర్ణయించామని మెట్రోవాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. గత నెల 19న ప్రభుత్వానికి లెటర్​రాయగా, స్పందించిన సర్కారు అనుమతిని ఇచ్చిందని చెప్పారు. గతంలో కూడా రెండు సార్లు వాటర్​బోర్డు వన్ టైమ్ సెటిల్​మెంట్​స్కీమ్​అమలు చేసింది.  

నల్లా కనెక్షన్​యాక్టివ్​గా ఉంటేనే..

నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఓటీఎస్​పథకం వర్తిస్తుందని, అది కూడా బకాయి మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కనెక్షన్ డిస్ కనెకనెక్ట్​అయిన వారికి ఈ పథకం వర్తించదన్నారు. ఓటీఎస్​ప్రయోజనం పొందాలనుకునే వారు భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తామని తెలిపారు. 

ఎంత ఉంటే ఎవరి దగ్గరకు వెళ్లాలి..

నల్లా బిల్లుల బకాయిలను బట్టి వినియోగదారులు అధికారుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది.  రూ.2 వేల వరకు ఉంటే మేనేజర్, రూ.2001 నుంచి రూ.10 వేల వరకు డిప్యూటీ జీఎం, రూ.10,001 నుంచి రూ.1లోపు ఉంటే జనరల్ మేనేజర్,  రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ ఉంటే చీఫ్ జీఎంను సంప్రదించాల్సి ఉంటుంది.