
పద్మారావునగర్, వెలుగు: చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో ఇంట్లోకి చొరబడి తల్లీకొడుకులను దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచింది కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెట్టుగూడలో ఉండే శేఖర్, రేణుక దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు యశ్వంత్ మూడునెలలుగా జాబ్ లేక ఇంట్లో ఉంటున్నాడు.
కాగా గురువారం మధ్యాహ్నం తల్లి రేణుక, పెద్ద కొడుకు యశ్వంత్ పై కొందరు దుండగులు ఇంట్లో చొరబడి కత్తితో దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణుకా ఇద్దరు కుమారులు యశ్ పాల్, వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. దుండగులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేవు. పెద్ద కొడుకు యశ్వంత్కు జాబ్ లేకపోవడంతో కత్తితో కడుపులో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటుండగా.. అడ్డుకున్న తల్లిని పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు.
గాంధీ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న ఇద్దరు కోలుకోగానే వారి వాంగూల్మం తీసుకుని కేసు నమోదు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.