
- భారత చరిత్రలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్గా రికార్డు
న్యూఢిల్లీ: భారతీయ ప్రముఖ చరిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది. మార్చి 19న ప్రముఖ వేలం సంస్థ క్రీస్టి న్యూయార్క్లో ఈ పెయింటింగ్ను ఆక్షన్ వేయగా, ఏకంగా రూ.118 కోట్లు (13.8 మిలియన్ డాలర్లు) పలికింది. ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ఖరీదైన పెయింటింగ్గా ఈ పెయింటింగ్ రికార్డు సృష్టించింది. ఆన్టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) పేరుతో ఈ పెయింటింగ్ను ఎంఎఫ్ హుస్సేన్ 1954లో గీశారు.
గ్రామాల్లో తీర్థయాత్రలను ప్రతిబింబిస్తూ 14 అడుగుల సింగిల్ కాన్వాస్ మీద 13 రకాల చిత్రాలను ఆయన రూపొందించారు. ఇదివరకు అమృతా షెర్గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’అనే పెయింటింగ్ 2023లో ముంబైలో వేలం వేయగా రూ.61.8 కోట్లు (7.4 మిలియన్ డాలర్లు) రికార్డు ధర పలికింది.
భారతీయ చరిత్రలో ఇప్పటివరకు రికార్డు ధర పలికిన పెయింటింగ్గా ది స్టోరీ టెల్లర్ ఉండగా, ప్రస్తుతం ఎంఎఫ్ హుస్సేన్ గీసిన గ్రామ్ యాత్ర పెయింటింగ్ రికార్డు సృష్టించింది. ఈ వేలంలో తాము భాగస్వామ్యులం అయినందుకు క్రీస్టి సంస్థ ఆనందం వ్యక్తం చేసింది.