రానున్నది మధ్య తరగతి భారతమా!

రానున్నది మధ్య తరగతి భారతమా!

భారతావనికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏండ్లు పూర్తికానున్న తరుణాన దేశ జనాభాలో  2047 నాటికి మధ్య తరగతి వర్గాల జనాభా 102 కోట్లకు చేరుతుందని అంచనా. అప్పటి దేశ జనాభా 166 కోట్లలో 61 శాతం మిడిల్‌ క్లాస్‌ వర్గాలు మెజార్టీ స్థానంలో ఉంటారని  ‘‌పీపుల్స్‌ రీసెర్చ్‌ ఆన్‌‌ ఇండియాస్‌‌ కన్జ్యూమర్‌ క్లాస్‌ (ప్రైస్)’ అనే సంస్థ తెలిపింది. ఈ సంస్థ విడుదల చేసిన  ‘ది రైజ్ ఆఫ్‌‌ఇండియాస్‌‌ మిడిల్‌‌క్లాస్‌’ అనే నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది.

ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతావని ఆర్థిక వ్యవస్థ  రూపాంతరం చెందుతున్నదని , 2047 వరకు సాలీనా సగటున 6 – 7 శాతం అభివృద్ధి రేటు నమోదు అవుతుందని వివరించారు.  ప్రైస్‌ సంస్థ 2014, 2016, 2021లలో  నిర్వహించిన  సర్వేలో  2 లక్షల కుటుంబాల వివరాలను పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయ అధ్యయనం చేశారు. 

అల్పాదాయ, మధ్య ఆదాయ,ధనికవర్గాల వర్గీకరణ ఇలా...

సాలీనా 5 నుంచి 30 లక్షల ఆదాయం నమోదు చేసిన కుటుంబాలను మధ్య తరగతి (మిడిల్ క్లాస్‌)‌గా వర్గీకరించారు. మధ్యతరగతిలో 5 – 15 లక్షల వార్షిక ఆదాయ కుటుంబాలను ‘సీకర్స్‌’గా, 15 – 30 లక్షల ఆదాయ కుటుంబాలను ‘స్ట్రైవర్స్‌’గా విభజించారు. ధనవంతుల్లో 30 –- 50 లక్షల వార్షిక కుటుంబ ఆదాయం పొందే వర్గాన్ని ‘నియర్‌‌రిచ్‌’ అని, 1– - 2 కోట్ల ఆదాయం పొందే కుటుంబాలను ‘షీర్‌ రిచ్‌’ అని, 2 కోట్లకు పైగా ఆదాయం పొందుతున్న కుటుంబాలను ‘సూపర్‌‌రిచ్‌’ అంటూ వర్గీకరించారు.

 అత్యల్ప ఆదాయం పొందుతున్న వర్గాల్లో  సాలీనా 1.25 లక్షల కన్నా తక్కువ ఆదాయ కుటుంబాలను ‘డెస్టిట్యూట్స్‌’గా, 1.25–- 5 లక్షల వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలను ‘ఆస్పైరర్స్‌’గా విభజించారు. దేశ ఆర్థిక రాజకీయ సంస్కరణలు ఫలిస్తే 2047 నాటికి అల్పాదాయ డెస్టిట్యూట్స్‌, ఆస్పైరర్స్‌ వర్గాల కుటుంబాలు గణనీయంగా తగ్గుతూ మధ్య తరగతి / సంపన్న కుటుంబాలు పెరుగుతాయని విశ్లేషించారు. 

ఆదాయ, వ్యయాలు

ధనవంతుల కుటుంబాల్లో డిగ్రీ పొందిన యువత ఎక్కువగా ఉండగా, నిరుపేదల్లో నిరక్షరాస్యులు అధికంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేస్తున్నది.  పేదల్లో 15 శాతం పూర్తిగా నిరక్షరాస్యులు,  37 శాతం మంది ప్రాథమిక పాఠశాల విద్య పొందిన బడుగులు ఉన్నట్లు తెలుస్తున్నది. విద్యార్హతలు పెరిగినకొద్దీ ఆదాయం కూడా పెరుగుతున్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది.  ప్రైవేట్‌ ఉద్యోగాలు,  స్వయం ఉపాధి పొందుతున్న వారిలో మధ్య తరగతి,  సంపన్న వర్గాల యువత అధికంగా ఉన్నట్లు విదితం అవుతున్నది. 

2021లో పేదలు ఏడాదికి సగటున రూ. 82,300  ఖర్చు చేస్తున్నారని, సంపన్నుల 25 రెట్లు అధికంగా రూ. 20.47 లక్షల వరకు వెచ్చిస్తున్నారని తెలుస్తున్నది. పేద వర్గాలు తమ ఆదాయంలో 67 శాతం కనీస అవసరాలకు, ముఖ్యంగా ఆహార పదార్థాల కొనుగోలుకు, మధ్య తరగతి వర్గాలు 51 శాతం, సంపన్నులు 44 శాతం ఖర్చు చేస్తున్నారని తెలిపింది. 

 సంపన్నులుఅధికంగా విలాసవంతమైన జీవన విధానాలకు, విలాసాలకు (విహారయాత్రలు, ఆధునిక ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఉన్నత విద్య లాంటి) తమ ఆదాయంలో 50 శాతం ఖర్చు చేస్తున్నారని అర్థం అవుతున్నది. దేశంలో మధ్య తరగతి వర్గాల ద్వారా ఆదాయం, వ్యయం, పొదుపులాంటివి అధికంగా జరుగుతూ దేశ ఆర్థిక గమనానికి దోహదపడుతున్నట్లు వివరించారు. 

అట్టడుగు వర్గాలకు..అందుబాటులోకి ఇంటర్​నెట్​

దేశవ్యాప్తంగా అన్ని వర్గాల కుటుంబాలకు విద్యుత్‌ అందుబాటు క్రమంగా పెరుగుతున్నదని,  సురక్షిత తాగునీటి లభ్యత.. మధ్య తరగతి/సంపన్నులకు మాత్రమే లభిస్తున్నదని, పేదలు ఇంకా వెనకబడి ఉన్నారని ’ప్రైస్​’ నివేదిక స్పష్టం చేస్తున్నది.  2021లో 30 శాతం పేద కుటుంబాలకు కుళాయి నీరు లభ్యం అవగా,  50 శాతం కుటుంబాలు నల్లా నీటి సౌకర్యానికి దూరంగా ఉన్నాయని తేల్చింది. 

డిజిటల్‌‌ అనుసంధానంలో అసమానతలు గణనీయంగా తగ్గుతున్నాయి. 85 శాతం పేదలకు సెల్‌ ఫోన్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.  39 శాతం పేదలు ఇంటర్నెట్‌‌కూడా వినియోగి స్తున్నారని, 90 శాతానికి పైగా పేద కుటుంబాలు సీలింగ్‌‌ఫ్యాన్లను వాడుతున్నా రని ’ప్రైస్​’ సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.  

కుటుంబ ఆదాయాల్లో పెరుగుదల

2047 నాటికి భారత కుటుంబ సగటు వార్షిక ఆదాయం 20 లక్షల వరకు చేరవచ్చనే శుభవార్తను నివేదిక  వెల్లడించింది. 2016-21 మధ్య కాలంలో సంపన్నుల అభివృద్ధి రేటు 10 శాతం, మధ్య తరగతి వృద్ధి రేటు 4 - 7.5 శాతం, పేదల్లో అభివృద్ధి రేటు 0.6 శాతం ఉంటుందని తేల్చింది. దేశవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు క్రమంగా పెరగడం తప్పదని, గ్రామీణ కుటుంబాలు ఉన్నత ఆదాయ వర్గాలకు చేరడం, పేదలు మధ్య తరగతికి, మధ్య తరగతి వర్గాలు ధనవంతుల వర్గంలోకి మారతారని వివరించింది. 

2016-21 మధ్య కాలంలో పట్టణాల్లో పేద కుటుంబాలు 7.6 శాతం పెరగడం జరిగిందని ‘పీపుల్స్‌ రీసెర్చ్‌ ఆన్‌‌ ఇండియాస్‌‌ కన్జ్యూమర్‌ క్లాస్‌’ సంస్థ అంచనా వేసింది.  దీంతో సంపన్న వర్గాలు పట్టణాల్లో, పేదలు  గ్రామీణ  భారతంలో  విస్తరిస్తారని తెలుస్తున్నది. 

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి