హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య..15నెలలు మిలటరీ పాలన

హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య..15నెలలు మిలటరీ పాలన

హైదరాబాద్​ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్య జరపడంతో 1948, సెప్టెంబర్ 17న లాయఖ్​ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించింది. అదేరోజు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్​ లేక్​ వ్యూ అతిథి గృహంలో హైదరాబాద్​ రాజ్యంలో భారత ప్రభుత్వ ఏజెంట్​ కేఎం మున్షీని కలిసి హైదరాబాద్​ సంస్థానం భారత యూనియన్​లో లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. 

ఈ సందర్భంలో ఏడో నిజాంతో అధికారికంగా పోలీస్​ చర్యను ఆహ్వానిస్తూ, భారత సైన్యాలకు లొంగిపోతున్నట్లు, యూఎన్​ఓలోని భద్రతా మండ​లిలో చేసిన ఫిర్యాదులను ఉపసంహరిస్తూ  రేడియో ప్రకటన చేయాలని కేఎం మున్షీ ప్రతిపాదించాడు. ఇందుకు అనుగుణంగా నిజాం అదే రోజు సాయంత్రం 7 గంటలకు దక్కన్​ రేడియోలో ప్రకటన చేశాడు. అంతేకాకుండా భారత సైన్యాలను బొల్లారం, సికింద్రాబాద్​లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతించారు.

 కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు, కొత్త ప్రధాన మంత్రిని నియమించే వరకు రోజువారి పరిపాలనా వ్యవహారాల్లో తనకు సహాయ పడటానికి కమిటీని ఏర్పాటు చేశారు. కానీ, మిలటరీ నియమాల ప్రకారం 1948, సెప్టెంబర్​ 18న హైదరాబాద్​ చేరుకున్న  మేజర్​ జనరల్​ జేఎన్​ చౌదరి పరిపాలన బాధ్యతలు స్వీకరించాడు. 

పరిపాలన వ్యవహారాలు మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లడంతో ఈ ప్రభుత్వాన్ని మిలటరీ ప్రభుత్వం అంటారు. 1948, సెప్టెంబర్​ 18 నుంచి 1949, డిసెంబర్​ 31 వరకు మిలటరీ ప్రభుత్వం కొనసాగింది. హైదరాబాద్​ రాష్ట్రంలో రజాకారులను, కమ్యూనిస్టులను అణచివేయడంలో విజయం సాధించారు. నిజాంకు చెందిన సర్ఫేఖాస్​ భూములను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నష్టపరిహారంగా 3 కోట్ల రూపాయలను చెల్లించింది. 

జేఎన్​ చౌదరి పరిపాలన కాలంలో పౌర పరిపాలన శాఖను సివిల్​ అడ్మినిస్ట్రేట్​ అని మిలటరీ గవర్నర్​ నేతృత్వంలో నెలకొల్పారు. ఈ శాఖను చూసే అత్యున్నత అధికారిని చీఫ్​ అడ్మినిస్ట్రేటర్​ అని, తాలుకాదార్​ (కలెక్టర్​)ను సివిల్​ అడ్మినిస్ట్రేటర్​ అని, దోయం తాలూకాదార్​ (డిప్యూటీ కలెక్టర్​)ను డిప్యూటీ సివిల్ అడ్మినిస్ట్రేటర్​ అని, తహసీల్దార్​ను అసిస్టెంట్​ సివిల్​ అడ్మినిస్ట్రేటర్​ అని పిలిచేవారు. చీఫ్​ సివిల్​ అడ్మినిస్ట్రేటర్​కు దాదాపు ముఖ్యమంత్రి హోదా ఉండేది. హైదరాబాద్​ రాష్ట్రంలో మరాఠా, కన్నడ, తెలంగాణకు ప్రాంతాలకు చెందిన 16 జిల్లాలు ఉండేవి. 

ఒక్కో జిల్లాకు ఒక పౌరపాలన అధికారిని నియమించారు. అంతేకాకుండా బొంబాయి, మద్రాస్ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కొంతమంది ఐపీఎస్​ అధికారులను రప్పించి 16 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల కంటే ఉన్నత హోదాలో వారిని నియమించాడు. ఈ విధమైన పరిపాలన సంస్కరణలు ప్రవేశపెట్టినా హైదరాబాద్​ రాష్ట్రం పాలన గాడిన పడలేదు. పోలీస్​ చర్య అనంతరం జేఎన్​ చౌదరి రాష్ట్రాన్ని గాడిన పెట్టడంలో భాగంగా కమ్యూనిస్టులను అణచివేశాడు. 

కేంద్ర ప్రభుత్వం జేఎన్​ చౌదరికి ఐదుగురు సలహాదారులను నియమించింది. చీఫ్​ అడ్మినిస్ట్రేటర్​ దత్త ప్రసన్న సదాశివ బాఖ్లే (డీఎస్ బాఖ్లే), అడిషనల్​ చీఫ్​ సివిల్​ అడ్మినిస్ట్రేటర్డీ ఆర్ ప్రధాన్​ (ఐసీఎస్​), సభ్యులు నవాబ్​ జైన్​ యార్జంగ్​ బహదూర్​, రాజా దొండిరాజ్ బహదూర్​, జి.వి.హెచ్​.కృష్ణారావు, సి.వి.ఎస్​.రావు 

జేఎన్​ చౌదరి ఫర్మానా (1949, ఫిబ్రవరి 6)

ఈ ఫర్మానాను రాజ్​ప్రముఖ్​ హోదాలో నిజాం మీర్ ఉస్మాన్​ అలీఖాన్​ జారీ చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం శుక్రవారం స్థానంలో ఆదివారంగా మార్చారు. జాగీర్లు రద్దయ్యాయి. ఈ చర్య వల్ల హైదరాబాద్​ నగరం అత్యంత ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్న నగరంగా దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. నిజాం కరెన్సీ రద్దయింది. 1955, ఏప్రిల్​ 1న ఉస్మానియా సిక్కా పూర్తిగా రద్దయింది. నిజాం ఆస్తి అయిన సర్ఫేఖాస్​ను ప్రభుత్వం వినియోగించుకున్నది. 

పండిట్​ సుందర్​లాల్​ కమిటీ

పోలీస్​ చర్య సందర్భంగా భారత సైన్యం చేతిలో వేల మంది ప్రాణాలను కోల్పోయారని జవహర్​లాల్​  నెహ్రూ ప్రభుత్వం నియమించిన పండిట్​ సుందర్​లాల్​ కమిటీ రిపోర్టులో పేర్కొన్నది. పోలీస్​ చర్య వల్ల నిజాంతోపాటు రజాకార్లు, వారి నాయకుడు ఖాసీం రజ్వీ లొంగిపోయారు. కానీ రజాకార్లు లొంగిపోయే ముందు వారి ఆయుధాలను కమ్యూనిస్టులకు అప్పగించారనే తప్పుడు భావనతో మిలటరీ గవర్నర్ జేఎన్​ చౌదరి కేంద్ర ప్రభుత్వ పరోక్ష అండదండలతో కమ్యూనిస్టులతోపాటు ముస్లింలపై దాడులను ముమ్మరం చేయడం కాకుండా మారణహోమం సృష్టించారు. 

చివరికి భారత ప్రభుత్వం ముస్లింలపై జరిగిన దాడులపై విచారణ జరపడానికి 1949, అక్టోబర్​లో పండిట్​ సుందర్​లాల్​ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. సభ్యులుగా ఖాజీ అబ్దుల్ గఫార్​, మౌలానా అబ్దుల్ మిస్త్రి, కార్యదర్శులుగా ఫరూఖ్​ సియార్​, పి.వి.అంబుల్కర్​లను​ నియమించారు. ఈ కమిటీ 1949, నవంబర్ 29 నుంచి హైదరాబాద్​తోపాటు 9 జిల్లాలు, ఏడు జిల్లాల కేంద్రాలు, 21 పట్టణాలు, 23 గ్రామాలను సందర్శించి విచారణ జరిపింది. 1949, డిసెంబర్​ 21న కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. 

ఈ నివేదికలోని అంశాలను ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం వల్ల దాడుల తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2013లో యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియంలోని లైబ్రరీలో ఉన్న నివేదికను అందుబాటులోకి తెచ్చింది. పండిట్​ సుందర్​లాల్​ కమిటీ నివేదిక ఢిల్లీలోని లైబ్రరీలో ఉంది. దీనిని 2015, సెప్టెంబర్ 17న బహిర్గతం చేశారు. ఈ కమిటీ నివేదిక ప్రకారం 27,000 మంది మరణించారు.

జేఎన్​ చౌదరి

జయంత్​నాథ్​ చౌదరి బెంగాల్​లోని హరిపురాలో జన్మించాడు. ఈయన డబ్ల్యూసీ బెనర్జీ మనుమడు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఆర్డర్ ఆఫ్​ బ్రిటీష్​ ఎంపైర్​ను పొందాడు. 1948, ఫిబ్రవరిలో మేజర్​ జనరల్​గా పదోన్నతి పొంది చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​గా బాధ్యతలు నిర్వర్తించాడు. 1965లో పాకిస్తాన్​తో యుద్ధం సమయంలో జేఎన్​ చౌదరి ఆర్మీ చీఫ్​ హోదాలో భారత సైన్యాలను ముందుకు నడిపించాడు. దేశంలోనే అతిపెద్ద మిలటరీ స్టేషన్​ అయిన సికింద్రాబాద్​ బైసన్​పోలో డివిజన్​లోని బ్రిటీష్​ ఆర్మీలో పనిచేశారు.