ముగిసిన మినీ మేడారం జాతర

ముగిసిన మినీ మేడారం జాతర
  • నాలుగు రోజుల పాటు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • బుధవారం తిరుగువారం పండుగ 

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మినీమేడారం జాతర శనివారంతో ముగిసింది. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని 12వ తేదీన మొదలైన వన దేవతల పండుగ శనివారం వరకు సాగింది. నాలుగు రోజుల పాటు జరిగిన జాతరకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు.

వచ్చే ఏడాది జరిగే మహా జాతరకు మళ్లీ వస్తామంటూ అమ్మవార్లను వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్పీ శబరీశ్‌‌ ఆదేశాల మేరకు డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. వచ్చే బుధవారం మినీ మేడారం తిరుగువారం పండుగను నిర్వహిస్తామని పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు.