
హనుమకొండ, వెలుగు: హనుమకొండ జిల్లాలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. కొందరు వ్యక్తులు ఆఫీసర్లను చెప్పుచేతల్లో పెట్టుకుని మట్టి దందాతో ప్రభుత్వ, ప్రైవేట్ భూములన్నింటినీ కొల్లగొడుతున్నారు. సర్కార్కు పైసా రాయల్టీ కట్టకుండా జేసీబీలు, టిప్పర్లతో రాత్రికి రాత్రే మొరం, మట్టిని తవ్వి తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ సిబ్బంది సహకారంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా సుమారు రూ.20 కోట్ల మేర ఈ దందా నడుస్తోంది. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా ఈ తవ్వకాల గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి సమాచారాన్ని ఆఫీసర్లపై మైనింగ్ మాఫియాకు చేరవేస్తున్నారు.
ప్రతి రోజు రూ. కోట్లల్లో బిజినెస్
ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో మొరం, మట్టి తీసుకోవాలంటే మైనింగ్ డిపార్ట్మెంట్కు రాయల్టీ కట్టాలి. అలాగే స్థానిక పంచాయతీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఎన్వోసీ తీసుకోవాలి. కానీ హనుమకొండ జిల్లాలో ఎక్కడా ఈ రూల్స్ అమలు కావడం లేదు. కొంతమంది ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా, ఆఫీసర్ల అండతో మట్టి దందాకు పాల్పడుతున్నారు. జిల్లాలోని ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ఐనవోలు, హసన్పర్తి, వేలేరు మండలాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఒక్కో టిప్పర్ లోడ్ను రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా ధర్మసాగర్ మండలం నుంచి నిత్యం వందల ట్రిప్పుల మొరం, మట్టి తరలిపోతోంది.
ఇక్కడ ప్రతి రోజు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీస్ పక్క నుంచే ఈ టిప్పర్లు నడుస్తున్నా ఆఫీసర్లెవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక్కడ ఒక యూట్యూబర్ మరికొందరితో కలిసి చేస్తున్న దందాకు ఆఫీసర్లు సైతం ఫుల్గా సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. మట్టి, మొరాన్ని కొందరు వెంచర్లకు తరలిస్తుండగా, మరికొందరు పెద్దఎత్తున డంప్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న కరుణాపురం బ్రిడ్జి పక్కన, రాంపూర్ – -పెద్దపెండ్యాల మార్గంలో, ఎల్కతుర్తి సమీపంలో పదుల సంఖ్యలో ఉన్న డంపులే ఇక్కడి ఇల్లీగల్ దందాను కళ్లకు కడుతున్నాయి.
అంతా ఆఫీసర్ల కనుసన్నల్లోనే..
ఇల్లీగల్ మైనింగ్కు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్ల కనుసన్నల్లోనే జరుగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ధర్మసాగర్ బోడబండ సమీపంలోని మూడెకరాల స్థలంలో ఎలాంటి పర్మిషన్ లేకుండానే తవ్వకాలు స్టార్ట్ చేశాడు. ఆఫీసర్లను మేనేజ్ చేసి దందా మొదలుపెట్టగా స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి రూ.30 లక్షల విలువైన మట్టిని తరలించినట్లు నిర్ధారించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇందుకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టడమే కారణమని పలువురు అంటున్నారు. ఈ విషయం విజిలెన్స్ ఆఫీసర్ల దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి ఎంక్వైరీ చేశారు.
ఐదు రోజుల కింద అదే వ్యక్తి హసన్పర్తి మండలం మడిపల్లి శివారులో మట్టి తవ్వుతుండగా స్థానికులు ఫిర్యాదుతో పోలీసులు వచ్చారు. వీరిని చూసిన అక్రమార్కులు జేసీబీ, టిప్పర్ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆఫీసర్లు లైట్ తీసుకుంటుండడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎల్కతుర్తి శివారులో సైనిక్స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం కూడా ఈ దందాకు అడ్డాగా మారడం గమనార్హం. అలాగే జానకీపురం శివారులోని కుంట వద్ద ఓ వ్యక్తి తవ్వుతుండగా ఇటీవల స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే ఓ ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లగా ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. అలాగే ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లోని బావండ్ల కుంట, వీరనారాయణపూర్లోని దామెరకుంట చెరువు, ఎస్సారెస్సీ భూములు, వాగులో మొరం తీస్తూ కొత్త వెంచర్లకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మీడియేటర్ల ద్వారా వసూళ్లు
మామూళ్లకు అలవాటుపడిన కొందరు పోలీసులు మట్టి దందాకు సపోర్ట్ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కాజీపేట డివిజన్ పరిధిలోని ఓ సీఐ అధికార పార్టీకి చెందిన వ్యక్తిని మీడియేటర్గా పెట్టి ప్రతి నెలా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. మామూళ్లు వసూలు చేయడంతో పాటు ఎవరైనా చెప్పిన టైంలోగా డబ్బులు ఇవ్వకపోతే బెదిరింపులకు సైతం దిగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల కింద తన వాట్సాప్ స్టేటస్లో ‘మామూళ్లు ఇవ్వకపోతే టిప్పర్లు ఆపేస్తాం.. సార్ చెప్పమన్నాడు.. ఇక మీ ఇష్టం’ అంటూ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఎల్కతుర్తి మండలం పెద్దవాగు వెంట హసన్పర్తి మండలం అనంతసాగర్కు చెందిన మట్టి మాఫియా తవ్వకాలు చేస్తుండగా కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఓ పోలీస్ ఆఫీసర్ సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అక్రమార్కులకు అందించి వారితో బేరం కుదుర్చుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.