టైమ్ పాటించాల్సిందే.. డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవు: మంత్రి దామోదర రాజనర్సింహ

టైమ్ పాటించాల్సిందే.. డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవు: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్: డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందేనని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆశ వర్కర్ల నుంచి మొదలు పెడితే, టీచింగ్ హాస్పిటల్స్‌లో ప్రిన్సిపల్స్ వరకూఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయాల్సిందేనన్నారు. డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు బుధవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయపాలన, హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్ నిర్వాహణ, అవయవదానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.  

జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, జీవన్‌దాన్ ట్రస్ట్ ఇంచార్జ్‌, డాక్టర్ భూషణ్ రాజు, గాంధీ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఇందిరా, సూపరింటెండెంట్ రాజకుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖాన్లపై నమ్మకాన్ని పెంచేలా డాక్టర్లు, సిబ్బంది పనిచేయాలన్నారు. గాంధీ హాస్పిటల్‌లో ముందస్తు సమాచారం లేకుండా డాక్టర్లు డ్యూటీలకు గైర్హాజరు అవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

డాక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని, వారిని చూసి వైద్య సిబ్బంది కూడా బాధ్యతగా ఉంటారన్నారు. అన్ని మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో అటెండెన్స్ మానిటరింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాలని డీఎంఈ నరేంద్ర కుమార్‌‌ను మంత్రి ఆదేశించారు. అటెండెన్స్ మానిటరింగ్ కోసం ప్రతి కాలేజీలో ఓ సీనియర్ ప్రొఫెసర్‌‌ను నోడల్ ఆఫీసర్‌‌గా నియమించాలని సూచించారు. హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు. 2022, 2023, 2024లో మూడు దశల్లో ఏర్పాటైన 25 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్ల నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. వర్షాకాలంలోగా వీలైనంత వేగంగా ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. 

హాస్పిటళ్లలో డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్ పనితీరుపై సమావేశంలో చర్చించారు. నిపుణులైన బయోమెడికల్ ఇంజనీర్ల కొరత ఉన్నదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బయోమెడికల్ ఇంజనీర్లు, టెక్నీషియన్ల నియమాకానికి చర్యలు తీసుకోవావాలని, వారికి ట్రైనింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ట్రైనింగ్ బాధ్యతలను నిమ్స్‌లో ఉన్న బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించాలని ఆదేశించారు. జీవన్‌దాన్‌ పనితీరుపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల సంఖ్య పెంచాలని, ఆరోగ్యశ్రీ కింద వీలైనంత ఎక్కువ మంది పేషెంట్లకు అవయవ మార్పిడి చికిత్స చేయాలని మంత్రి సూచించారు. గాంధీలో ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ పనులను త్వరగా పూర్తిచేయాలని, మెడికల్ కార్పొరేషన్ ఎండీ హేమంత్‌ను మంత్రి ఆదేశించారు