అసమానతలు రూపుమాపుతం.. ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలు: మంత్రి దామోదర రాజనర్సింహ

అసమానతలు రూపుమాపుతం.. ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలు: మంత్రి దామోదర రాజనర్సింహ
  • –ఎమ్మెల్యేలు, నాయకులదే ఆ బాధ్యత
  • –శాస్త్రీయ అధ్యయనం తర్వాతే కమిషన్ నివేదిక
  • –అన్ని వర్గాలకు న్యాయం చేసేలా మూడు గ్రూపులు
  • –ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు

హైదరాబాద్: అణిచివేయబడిన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే వర్గీకరణ అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం కాదన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలను తీసుకెళ్లే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. 

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, లక్ష్మీకాంతరావు, అడ్లూరి లక్ష్మణ్, మందుల సామెల్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు ఇవాళ హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. ఇతరులు సృష్టించే అపోహలను, అనుమానాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలది, మాదిగ సామాజిక వర్గ నాయకులదేనన్నారు. 

ALSO READ | స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా.. పార్టీల రియాక్షన్ ఇదే..

వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ మద్దతుగా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. 2006 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో, 2024 ఆగస్ట్‌ ఒకటిన తీర్పు వచ్చిందని, తీర్పు వచ్చిన గంట లోపలే వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఆ వెంటనే కేబినెట్ సబ్ కమిటీ, ఆ తర్వాత వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించారన్నారు. 

 ఇది కాంగ్రెస్ కమిట్‌మెంట్‌

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా, జనాభా, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కమిషన్ అధ్యయనం చేసిందని తెలిపారు. అన్నిరకాల విశ్లేషణ, అధ్యయనం తర్వాత శాస్త్రీయంగా రూపొందించిన రిపోర్ట్‌ను అందించిందన్నారు. ఇది కాంగ్రెస్ కమిట్‌మెంట్‌ అని, సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతి కులానికి న్యాయం చేసేలా వర్గీకరణ ఉందని మంత్రి తెలిపారు. 

అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్‌ వన్‌లో, 18 కులాలను గ్రూప్‌2లో, కొంత మెరుగ్గా ఉన్న కులాలను గ్రూప్‌3లో చేర్చాలని కమిషన్ సూచించిందన్నారు. మాదిగ, మాదిగ సామాజిక వర్గాల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతున్న ఈ తరుణాన్ని పండుగలా జరుపుకోవాలని సూచించారు.