
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో ఆదివారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 2 నుంచి 22 వ వరకు ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 3 రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి రైతువేదికలో మామిడి తోరణాలతో అలంకరించి, స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన మీటింగ్లు పెట్టాలన్నారు.
రైతులకు సంబంధించిన పథకాలను ఫ్లెక్సీలతో ప్రదర్శించడంతో పాటు ఒక్కో రైతుకు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియజేయాలన్నారు. జూన్ 4 సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీస్ వ్యవస్థ ను ఎలా బలోపేతం చేశామో వివరించాలన్నారు. సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, సీపీ ఏవీ రంగనాథ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, పి. ప్రావీణ్య, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.