
కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నం సంఘటన చాలా బాధాకరమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతోందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను ఆదేశించామని వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు.. ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడి వారికి మంత్రి హరీష్ రావు మనోధైర్యం కల్పించారు. మరోవైపు.. వైద్యులతో గంట గంటకు స్వయంగా మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి హరీష్ రావు తెలుసుకుంటున్నారు.
మరోవైపు.. ప్రీతి ఆత్మహత్యయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఇదే విషయాన్ని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.