![పాలమూరు- రంగారెడ్డి పై కేంద్రం కుట్ర : మంత్రి జూపల్లి కృష్ణారావు](https://static.v6velugu.com/uploads/2025/02/minister-jupalli-krishna-rao-alleges-that-center-is-conspiring-against-palamuru-ranga-reddy-lift-irrigation-scheme_7k0PKpuMlr.jpg)
- టెక్నికల్ కారణాలను చూపి జాతీయ హోదా ఇవ్వకపోవడం అన్యాయం
- బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, ఇతర రాష్ట్రాలకు మరో న్యాయమా?
- మంత్రి జూపల్లి ఫైర్
హైదరాబాద్, వెలుగు: సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సాకుగా చూపి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్రం కుట్రపన్నుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. అన్ని అర్హతలున్నా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని నిలదీశారు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక విధంగా, ఇతర రాష్ట్రాలను మరో విధంగా చూస్తున్నదన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవే అడుగుతున్నామని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా నాన్చుతున్నారని మండిపడ్డారు. తమకు అనుకూల అంశాలపై నూతన చట్టాలు తీసుకొస్తున్నారని, రాజ్యాంగాన్ని మారుస్తున్నారనని, ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజల దశాబ్ధాల కలను మాత్రం నెరవేర్చడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ ఎంపీలు పట్టించుకోరా?
తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పట్టించుకోవడం లేదని మంత్రి జూపల్లి మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ తో ఒరిగిందేమిలేదని, ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చి, ప్రాజెక్టు పనులు ప్రారంభించిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఉంటే ఏనాడో పూర్తయ్యేదని, దీన్ని నిర్లక్ష్యం చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్ట్ లను పట్టించుకోలేదని, జాప్యానికి బీఆర్ఎస్ అసమర్థతే కారణమని పేర్కొన్నారు.