రెండేండ్లల్లో ఎస్ఎల్​బీసీ టన్నెల్ పూర్తి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రెండేండ్లల్లో ఎస్ఎల్​బీసీ టన్నెల్ పూర్తి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •  హైదరాబాద్​కు తాగునీరు, 4 లక్షల ఎకరాలకు సాగునీరు: వెంకట్​రెడ్డి
  •  టన్నెల్ బోరింగ్ మెషీనరీ కంపెనీ సీఈవోతో మంత్రి భేటీ
  •  బేరింగ్, స్పేర్ ​పార్ట్స్​పంపిస్తామన్న కంపెనీ

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ను కట్టడి చేయడంతోపాటు.. జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ కు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులను వచ్చే రెండేండ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ఒహయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషీనరీ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోంతో సమావేశమయ్యారు. టన్నెల్ తవ్వకానికి ఉపయోగించే మోడర్న్ మెషీనరిని ఈ సందర్భంగా సీఈవో లాక్ హోం వాటి పనితీరు గురించి మంత్రికి వివరించారు.

 టన్నెల్ తవ్వకానికి ఇబ్బందిగా మారిన బేరింగ్ తో పాటు ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను వీలైనంత త్వరగా సమకూర్చాలని సీఈవోను మంత్రి కోరారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ పూర్తయితే 3 లక్షల ఎకరాలకు ఎలాంటి పంపింగ్ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని, ఉదయ సముద్రంలో భాగమైన బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా మరో లక్ష ఎకరాలకు పంపింగ్ ద్వారా సాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. 

మొత్తంగా 4 లక్షల ఎకరాల భూములకు సాగునీటి సదుపాయం కలిగించే ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు, బేరింగ్, ఇతర రిపేర్లతో ఆగిపోయాయని.. స్వయంగా ప్రభుత్వమే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నందున బేరింగ్ తో పాటు ఇతర పరికరాలను వీలైనంత త్వరగా అందించాలని రాబిన్స్ కంపెనీ సీఈవో లాక్ హోం ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. తవ్వకానికి అవసరమైన స్పేర్ పార్ట్స్ అందించడంలో ఆలస్యం జరుగుతున్నందున ప్రాజెక్టు పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను రాబిన్స్ కంపెనీ సీఈవో లాక్ హోమ్ కు మంత్రి  వివరించారు. 

ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు, తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా ప్రాజెక్టు పనులకు బిల్లులు చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకున్నందున బేరింగ్ తో పాటు ఇతర స్పేర్ పార్ట్స్ ను వీలైనంత త్వరగా సమకూరిస్తే.. తక్షణం చెల్లింపులు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వివరించారు. గ్రీన్ చానెల్ అమల్లో ఉన్నందున పనులు జరిగిన 40 రోజుల్లనే బిల్స్ చెల్లిస్తామని మంత్రి తెలిపారు. టన్నెల్ నిర్మాణంలో ప్రధాన బేరింగ్ తో పాటు ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను అందించేందుకు సీఈవో సంసిద్ధత వ్యక్తం చేశారు.

రెండు నెల్లలో రాష్ట్రానికి బేరింగ్​

మరో రెండు నెలల్లో ఏడు డయామీటర్లు కలిగిన బేరింగ్ తో పాటు ఇతర స్పేర్ పార్ట్స్ ను షిప్ ద్వారా చెన్నైకి చేర్చుతామని అక్కడి నుంచి పనులు జరుగుతున్న ప్రాంతానికి పంపిస్తామని చెప్పారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును బ్లాస్టింగ్ ప్రక్రియలో పూర్తి చేసే అవకాశం ఏమాత్రం లేకపోవడం.. కేవలం టన్నెల్ బోరింగ్ ద్వారా మాత్రమే చేసే పరిస్థితులు ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రాబిన్స్ కంపెనీతో చర్చలు జరిపి పనులను ముందుకు తీసుకెళ్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మంత్రి వెంట నల్గొండ ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, ఎస్ఎల్ బీసీ కాంట్రాక్టర్ జేపీ అసోసియేట్ డైరెక్టర్ పంకజ్ గౌర్ ఉన్నారు.