
- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీలో 50 మంది మహిళలే ఉంటారని తెలిపారు. శనివారం నల్గొండలోని వెంకటేశ్వర హోటల్ లో కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ శాఖ, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
మహిళా కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కమిటీ సభ్యులను మంత్రి సన్మానించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యడు వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.
రివర్ నిమ్స్ హాస్పిటల్ లో..
నల్గొండలోని రివర్ నిమ్స్ హాస్పిటల్ లో ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. షీ టీం ఎస్సై అంజలి మాట్లాడుతూ.. మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. డాక్టర్లు కీర్తి రెడ్డి, ప్రజ్ఞ, సుధా రెడ్డి ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి, 200 మంది మహిళలకు హెల్త్ చెకప్ చేశారు.
హాలియా పట్టణంలో..
హాలియా, వెలుగు: హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పీడీ కోడుమూరు వెంకట్రామిరెడ్డి ఇంట్లో పలువురు మహిళలను సీఎల్పీమాజీ లీడర్ కుందూరు జానారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సన్మానించారు. మార్కెట్ యార్డులో అనుముల, పెద్దవూర, తిరుమలగిరి మండలాలకు చెందిన ప్రవేట్ పాఠశాలల మహిళా టీచర్లను మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. హాలియా పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుళ్లను సన్మానించారు.
కోదాడ పట్టణంలో..
కోదాడ, వెలుగు: పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. జూనియర్ సివిల్ జడ్జి భవ్య ను సన్మానించారు. సీనియర్ సివిల్ జడ్జి సురేష్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సత్యనారాయణ పాల్గొన్నారు.
మహిళలు ఆదర్శంగా ఎదగాలి
మేళ్లచెరువు, వెలుగు: మహిళలు అందరికీ ఆదర్శంగా ఎదగాలని మైహోం పరిశ్రమ శ్రీ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనురాధ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మై హోమ్ ఇండస్ట్రీస్ లో గల శ్రీనగర్ కాలనీ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.