![ఒక్క వాడ మునిగితే హైదరాబాద్ మునిగిందని రాయొద్దు](https://static.v6velugu.com/uploads/2022/06/Minister-KTR-Minister-speaking-About-Hyderabad-Nalas_LPke9EUfcS.jpg)
- ఒక్క వాడ మునిగితే హైదరాబాద్ మునిగిందని రాయొద్దు:కేటీఆర్
- రూ.వెయ్యి కోట్లతో నాలాలను అభివృద్ధి చేస్తున్నం
- మనది థ్యాంక్ లెస్జాబ్
- మన డబ్బా మనమే కొట్టుకోవాలి
- ఎంఏయూడీ వార్షిక నివేదికను ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో రూ.వెయ్యి కోట్లతో నాలాలను అభివృద్ధి చేస్తున్నామని, అయినా ఈ ఏడాది ముంపు ఉండదన్న గ్యారంటీ ఇవ్వలేమని మంత్రి కేటీఆర్ అన్నారు. నిరుటితో పోల్చితే ముంపు ప్రాంతాలు తగ్గుతాయన్నారు. నగరంలో వర్షాలకు ఒక్క వాడ మునిగితే మొత్తం హైదరాబాద్ మునిగిపోయినట్టు వార్తలు రాయొద్దన్నారు. పరిమితికి మించి కుంభవృష్టి కురిస్తే తట్టుకునే పరిస్థితి ఎవరికీ ఉండదన్నారు. శుక్రవారం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆఫీస్లో ఎంఏయూడీ 2021–22 వార్షిక నివేదికను కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు.
క్షమాపణలు చెపుతున్నా..
ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేయకున్నా మున్సిపల్ శాఖ వార్షిక ప్రగతి నివేదికను ఏటా వెల్లడి చేస్తున్నామని, ఏం చేశామో చెప్పుకుంటూ, చేయనివి ఎందుకు కాలేదో ప్రజలకు వివరిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ, మూసీపై 15 బ్రిడ్జిలు నిరుడే పూర్తి చేస్తామని చెప్పినా కరోనా వల్ల చేయలేకపోయామని, ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్తున్నానని అన్నారు. మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ఈ ఏడాదే భర్తీ చేస్తామన్నారు. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీల్లో రెండు వార్డులకు ఒక వార్డ్ ఆఫీసర్, 50 వేలకు పైగా జనాభా ఉన్న మున్సిపాల్టీల్లో వార్డుకు ఒక ఆఫీసర్ను నియమిస్తామని తెలిపారు. మున్సిపల్ శాఖలో పని థ్యాంక్స్ లెస్ జాబ్ అని, ఎంత చేసినా గుర్తింపు ఉండదన్నారు. వానపడి నీళ్లొచ్చినా, ఒక్క రోజు చెత్త ఎత్తకపోయినా అందరూ మనల్నే తిడతారని, ఇలాంటి పరిస్థితుల్లో మన డబ్బా మనమే కొట్టుకోవాలని సూచించారు.
30 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్ ఉండాలె..
దేశంలో 2050 నాటికి పట్టణ జనాభా 50 శాతానికి చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందని, తెలంగాణలో రానున్న మూడు, నాలుగేండ్లలోనే 50% దాటుతుందని కేటీఆర్ చెప్పారు. 46.8% పట్టణ జనాభా ఉన్న తెలంగాణకు కేంద్రం మరిన్ని స్మార్ట్ సిటీలు, అదనంగా నిధులు ఇవ్వాలని కోరారు. దేశంలోని మరో నగరంతో పోల్చుకోవడం కాదుగానీ ప్రపంచంలోనే బెస్ట్ 30 సిటీల్లో హైదరాబాద్ ఉండాలన్నదే తన లక్ష్యమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ 142% ఉందన్నారు. కరోనా కష్టకాలంలో అన్ని నగరాల్లో పనులు నిలిచిపోతే హైదరాబాద్ లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు విస్తృతంగా చేపట్టామన్నారు.
84 గ్రామాల అభివృద్ధి కోసమే జీవో 69..
మూసీ వరదలకు, జీవో 111కు ఎలాంటి సంబంధం లేదని, కొందరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జంట జలాశయాల క్యాచ్మెంట్ పరిరక్షణకు ఆ జీవో ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్కు జంట జలాశయాల నుంచి తాగునీళ్లే అవసరం లేదని, అలాంటప్పుడు జీవో 111ను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ఆ జీవో పరిధిలోని 84 గ్రామాల అభివృద్ధి కోసమే జీవో 69 తీసుకువచ్చామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 70 వేల వరకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, వాటిలో సివరేజీ, డ్రికింగ్ వాటర్ లాంటి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. క్రమం తప్పకుండా జీతాలు అందుతున్నాయి. తెలంగాణ రాకముందు మూడు, నాలుగు నెలలు పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోయేవారని, ఇప్పుడు కార్మికులు, సిబ్బందికి క్రమం తప్పకుండా జీతాలు అందుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 142 మున్సిపాల్టీలకు పట్టణ ప్రగతి కింద రూ.2,062 కోట్లు ఇచ్చామన్నారు. జవహర్ నగర్లోని 19.8 మెగావాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్రాంట్ కెపాసిటీని 48 మెగావాట్లాకు పెంచుతున్నామన్నారు.