
- తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేసిన బిల్ కలెక్టర్ సస్పెండ్..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించమని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.... ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బేస్ మెంట్ నిర్మాణం పూర్తి కాకుండానే తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేయగా.. జిల్లా పంచాయతీ అధికారి జగదీష్ ను విధుల నుంచి తొలగించారు.
భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 18 మంది లబ్ధిదారులు బేస్ మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేశారనే తప్పుడు సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేశారని, దీనిపై సంబంధిత బిల్ కలెక్టర్ కు మెమో జారీ చేయగా పొరపాటున ఈ సమాచారాన్ని అప్లోడ్ చేయడం అయిందని సంజా యిషి ఇవ్వడంతో ఆ బిల్ కలెక్టర్ ను ఉద్యోగాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అలసత్వం వహించే ఎంతటి వారినైనా సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.