
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణం చెల్లింపులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచినీళ్లు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాపై సమీక్ష నిర్వహించారు..
ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. బేస్ మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్లకు లక్ష రూపాయలు ఇస్తామని, వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని 2 బీహెచ్కే ఇండ్లను కేటాయించాలన్నారు. వేసవి కాలంలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ఆ తర్వాత మరో నెలరోజుల్లో వైద్య సేవలకు అవసరమైన పరికరాలను అమర్చాలన్నారు. జూన్ చివరినాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మడికొండ డంపింగ్ యార్డు సమస్యకు వారం రోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపించాక శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.