పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిఉందని రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏఎంసీ కాలనీలో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన   117 ఇండ్లను ఇటీవల పూర్తి చేసి ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం అందించిన ఇండ్లలో అన్ని వసతులు కల్పించామన్నారు. 2004 నుంచి 2014 వరకు 25లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా ఇండ్లను వదిలేయడంతో వాటిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పారు. 

 రూ.1.40కోట్లతో మనుబోతుల చెరువు వద్ద నిర్మించిన డంపింగ్​ యార్డును భద్రాచలం ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం ఐటీడీఏలోని ట్రైబల్​ మ్యూజియాన్ని  ఎంపీ బలరాంనాయక్​, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి సందర్శించారు. ప్రపంచానికి గిరిజన సంస్కృతిని పరిచయం చేసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రంజాన్​ పండుగ సందర్భంగా ముస్లింలకు బహుమతులు అందజేశారు. మంత్రి వెంట కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్​, డీఆర్​డీఓ విద్యాచందన, డీడీ మణెమ్మ ఉన్నారు. 

 మాడవీధుల స్థల సేకరణ పూర్తి చేస్తాం

భద్రాచలం రామాలయంలో మాడవీధుల అభివృద్ధికి స్థల సేకరణను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని, శ్రీరామనవమి నాడు సీఎం రేవంత్​రెడ్డి చేత పనులకు భూమి పూజను చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించి ఆర్డీవో ఆఫీసులో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. శ్రీరామనవమికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. 

ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. 

భద్రాద్రికొత్తగూడెం : ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్​లో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందులో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్​, కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​తో కలిసి ఆయన హాజరయ్యారు. ముస్లింలతో కలిసి నమాజ్​ చేశారు. అనంతరం చుంచుపల్లి మండలంలోని టాటా జుడియో షాపింగ్​ కాంప్లెక్స్​ను ప్రారంభించారు

ప్రెస్​క్లబ్​ కోసం ల్యాండ్​ కేటాయిస్తాం

కొత్తగూడెంలో మంత్రి టీయూడబ్ల్యుజే(ఐజేయూ) ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు మంత్రిని ఆదివారం కలిశారు. ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. కొత్తగూడెంలో జిల్లా స్థాయిలో నిర్మించే ప్రెస్​ క్లబ్​ కోసం ల్యాండ్​ కేటాయించాలని విజ్ఞప్లి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రెస్​ క్లబ్​ నిర్మాణం కోసం అవసరమైన ల్యాండ్​ను చూడాలని కలెక్టర్​కు సూచించారు. 

అభివృద్ధి త్వరగా పూర్తి చేయాలి

ఖమ్మం రూరల్/కూసుమంచి :  ఆదివారం  ఏదులాపురం మున్సిపల్ పరిధిలో  మంత్రి పొంగులేటి పర్యటించారు.  రూ.2 కోట్ల 85 లక్షలతో గుర్రాలపాడు నుంచి కొత్త నారాయణపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం, రూ. 2 కోట్ల 4 లక్షలతో వెంకటగిరి ఎస్సీ, బీసీ కాలనీ నుంచి ఖమ్మం గుదిమళ్ల జడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు, రూ.కోటి 95 లక్షలతో గుదిమళ్ల నుంచి తొర్రివాగు డొంక రైస్ మిల్లు వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ఏదులాపురం ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలన్నారు. వర్షాకాలం లోపు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి గుదిమళ్లలోని తిరుపతమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కూసుమంచి మండలంపాలేరు గ్రామంలో ఇటీవలఎడవల్లి రాంరెడ్డి మాతృమూర్తి మాణిక్యమ్మ  మృతి చెందడంతో మంత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు.