ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు స్పీడప్ చేయండి

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు స్పీడప్ చేయండి
  • ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు స్పీడప్ చేయండి
  • అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలి: మంత్రి పొంగులేటి
  • ఎమ్మెల్యేల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి
  • నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం
  • వరంగల్ జిల్లా నేతలతో రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. హిమాయత్​సాగర్​లోని తన నివాసంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి ఆదివారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.

ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే కలెక్టర్లు అందరూ పని చేయాలి. ఇండ్ల నిర్మాణ పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా నన్ను సంప్రదించాలి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కలెక్టర్లదే తుది నిర్ణయం. నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అర్హులను ఎంపిక చేయాలి. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయకపోతే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’’అని పొంగులేటి తెలిపారు.

 వేసవిని దృష్టిలో పెట్టుకొని సాగు, తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ మీటింగ్ లో ఎంపీలు కావ్య, బలరాంనాయక్, విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళీ నాయక్, యశస్విని రెడ్డి, కడియం శ్రీహరి, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.