
- మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, వెలుగు: పదేండ్లు బీఆర్ఎస్ నాయకులను ప్రజలు తిరస్కరించినా, ఇంకా అధికారంలో ఉన్నామనే భావన పోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో హైవే పనులను పరిశీలించారు. పనుల జాప్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా, పనిగా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు.
ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఓపెన్ చేశామని, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళనలు చేయాలని హితవు పలికారు. శాసనసభలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామని అయినప్పటికీ రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో మండలానికి నవోదయ స్కూల్ మంజూరు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. చిట్టంపెట్టి అయిలయ్య, బజ్జసురి అశోక్ ముఖర్జి, ఊసకోయిల ప్రకాశ్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.