
మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మహా శివరాత్రిపై ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పండగకు ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ , శ్రీశైలం , ఏడుపాయల , కీసర, పాలకుర్తి దేవాలయాలకు భక్తులు అధికంగా వెళ్లే అవకాశం ఉందని, ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ఆదేశించారు.
గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. బస్ స్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ,ఈడి మునిశేఖర్ , సీటీఎం శ్రీధర్ , ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప తదితరులు పాల్గొన్నారు.