నిరసన పేరుతో తాళాలు వేస్తే సహించం : పొన్నం ప్రభాకర్

నిరసన పేరుతో తాళాలు వేస్తే సహించం : పొన్నం ప్రభాకర్

సిద్దిపేట రూరల్, వెలుగు : నిరసన పేరుతో స్కూల్స్​, కాలేజీలకు తాళాలు వేసి స్టూడెంట్స్​ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గురుకులాలను పెట్టామని గొప్పలు చెప్పుకుందని కానీ ఒక్క గురుకులానికి సొంత భవనం నిర్మించలేదన్నారు. తమ ప్రభుత్వం 28వేల అమ్మ ఆదర్శ స్కూల్స్​కు రూ.1100కోట్లు చెల్లించిందన్నారు.

మంత్రిగా తాను సిద్దిపేటను కూడా అభివృద్ధి చేస్తానని, 25ఎకరాల్లో మూడు నియోజక వర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు. లైబ్రరీలు పారదర్శకంగా పనిచేయాలని ప్రభుత్వం నియమకాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, నియోజకవర్గాల ఇన్​చార్జిలు హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, చంద్రం, యాదగిరి, అత్తు ఇమామ్, పాండు పాల్గొన్నారు.

స్కూల్స్​, కాలేజీలు మూసివేస్తే కఠిన చర్యలు

జహీరాబాద్ : ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిలు ఉన్నాయని ప్రైవేట్​యాజమాన్యాలు స్కూల్స్​, కాలేజీలు మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంపీ క్యాంప్ ఆఫీసు ప్రారంభించి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తరగతులు నడుపుతూ నిరసనలను తెలియజేస్తే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గత ప్రభుత్వం ఫీజు రియింబర్స్​మెంట్​చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, పార్టీ ఆఫీసుల వల్ల ప్రజాప్రతినిధులు

నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి వీలు కలుగుతుందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి, మాజీమంత్రి చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్లమెంట్ సీనియర్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు హన్మంత్ రావు పటేల్, శ్రీనివాస్ రెడ్డి, రామలింగా రెడ్డి, నర్సింహరెడ్డి, మక్సుద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.