
- లేదంటే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా: మల్రెడ్డి రంగారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ‘‘రాష్ట్ర జనాభాలో 44 శాతం మంది ప్రజలు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉంటున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో జనాభా ఉన్న ఈ రెండు జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అలాంటప్పుడు ప్రజా పాలన అని ఎలా అనగలం’’అని ఆయన ప్రశ్నించారు. పాత పది జిల్లాలను ప్రామాణికంగా తీసుకొని మంత్రి పదవులు ఇవ్వాలని, లేదంటే తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నారు.
రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రాకపోవడానికి సామాజిక సమీకరణాలే కారణమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన స్థానంలో ఓ బీసీని గెలిపించుకుంటానని ఆయన మరోసారి స్పష్టం చేశారు.