
- తన తండ్రి చనిపోతే జాబ్ ఇవ్వలేదని ఒంటిపై పెట్రోల్ చల్లుకున్న సలీం
- అడ్డుకుని లాక్కెళ్లిన పోలీసులు
- 36 ఏండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన
- వీఆర్ఏల నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ఘటన
మహబూబాబాద్,వెలుగు: మహబూబాబాద్జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ వీఆర్ఏలకు నియామక పత్రాలు అందజేస్తుండగా ఓ వృద్ధుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. పోలీసులు అడ్డుకుని పక్కకు లాక్కెళ్లడంతో ప్రమాదం తప్పింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, గురువారం ఏబీ గార్డెన్స్లో మంత్రి సత్యవతి 360 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
వేదికపై మంత్రి ఉండగానే వచ్చిన నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన 65 ఏండ్ల షేక్ సలీం ఒంటిపై పెట్రోల్చల్లుకుని ‘నాకు న్యాయం చేయాలి..నాకు న్యాయం చేయాలి’ అంటూ అరవడం మొదలుపెట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. అక్కడ సలీం మాట్లాడుతూ తన తండ్రి హుస్సేన్ 1986లో గ్రామ వీఆర్ఏగా పని చేస్తూ చనిపోయాడని, అప్పటి నుంచి తన తండ్రి ఉద్యోగం ఇవ్వాలని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. 65 ఏండ్ల తన జీవితంలో 36 ఏండ్లు తిరగడానికే సరిపోయిందన్నారు.
ఈ విషయమై కోర్టుకు పోయానని వారు అధికారులను కలవాలని ఆదేశాలిచ్చారని, తనకు చదువు లేదనే కారణంతో పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. 2010 నుంచి తన అక్క కొడుకు షేక్యాకూబ్ను కాంట్రాక్ట్పద్ధతిపై కొనసాగించారని, తన ఫిర్యాదుతో గత ఏడాది తొలగించారన్నారు. కానీ, కొంత మంది రెవెన్యూ ఆఫీసర్లు అతడితో కుమ్మక్కై మళ్లీ అతడికే ఉద్యోగం ఇచ్చారన్నారు. తన వయస్సు ఎలాగూ అయిపోయిందని, కనీసం తన బిడ్డకయినా జాబ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంపై మంత్రి స్పందించలేదు. తర్వాత ప్రోగ్రామ్ యథావిధిగా కొనసాగింది.