మొల చింతలపల్లి చెంచు మహిళపై అత్యంత పాశవికంగా దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క అన్నారు. మధ్యయుగాల నాటి మనస్తత్వంతో మానవత్వాన్ని మరిచి మనుషుల రూపంలో ఉన్న మృగాళ్లు జరిపిన దాడిని ఉపేక్షించేది లేదన్నారు. అమ్మాయులు, మహిళలపై అఘా యిత్యాలకు తెగబడే వారిపై కఠినంగా వ్యవహించేందుకు తమ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తుందన్నారు.
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క బుధవారం నాడు పరమార్శించారు. బాధితురాలితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని బాధితురాలికి సీతక్క భరోసానిచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సీతక్క.. భాధితురాలని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ తరలించినట్లు సీతక్క తెలిపారు. బాధితురాలు పూర్తిగా కోలుకున్నాకే ఇంటికి పంపిస్తామన్నారు. బాదిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. ఘటనలో పాలు పంచుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నాగరకర్నూల్ ఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు.