
- మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
- రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి
- నిత్యం జిల్లా అధికారులతో మాట్లాడి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : ఈ వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని, విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని కరెంట్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. పంప్ హౌస్ మోటార్లలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సెక్రటేరియట్లో శనివారం మిషన్ భగీరథపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను అధికారులు మంత్రికి నివేదించారు. ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి.. తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నామని అధికారులు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈఎన్సీ నుంచి గ్రామస్థాయి వరకు మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీరోజు తాగునీటి సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్షించి నివేదిక ఇవ్వాలని కోరారు.
ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణం పరిష్కరించాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలున్నందున, వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైతే కలెక్టర్లకు ప్రత్యేక ఫండ్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు.