
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన బయో ఏషియా 2025 సదస్సులో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు లైఫ్ సైన్సెస్ పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. లైఫ్ సైన్సెస్ పాలసీ పై త్వరలోనే క్యాబినేట్ లో నిర్ణయం తీసుకుంటామని.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ నీ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు శ్రీధర్ బాబు.
ఇప్పుడున్న విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల పట్టాతో బయటకు వచ్చే విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం ఉండటం లేదని.. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుకే పరిశ్రమల భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీనీ ఏర్పాటు చేశామని అన్నారు.
ఫార్మా రంగంలో తెలంగాణలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని... కాలుష్యం లేకుండా వీటిని టైర్ 2 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. వికారాబాద్, జహీరాబాద్ లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని అన్నారు శ్రీధర్ బాబు. లగచర్లలో ఫార్మా పరిశ్రమలు కాకుండా పర్యవరణహిత పరిశ్రమల ను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని గుర్తు చేశారు.
ప్రభుత్వంపై ప్రజలు తెలిపే నిరసన, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని... అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని.. తెలంగాణలో యూఎస్ దిగ్గజ కంపెని ఆమ్జెన్, మరికొన్ని దిగ్గజ సంస్థలు రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు శ్రీధర్ బాబు.