బీజేపీ కోసమే బీఆర్‌‌ఎస్‌‌ పోటీ చేస్తలే : మంత్రి శ్రీధర్‌‌బాబు

బీజేపీ కోసమే బీఆర్‌‌ఎస్‌‌ పోటీ చేస్తలే : మంత్రి శ్రీధర్‌‌బాబు
  • పార్లమెంట్‌‌ ఎన్నికల టైంలోనే వారి బంధం స్పష్టమైంది

కరీంనగర్, వెలుగు : బీజేపీ క్యాండిడేట్‌‌ను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ పోటీ చేయడం లేదని మంత్రి శ్రీధర్‌‌బాబు ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని పార్లమెంట్‌‌ ఎన్నికల్లోనే స్పష్టమైందని, తమకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌‌ఎస్‌‌ మాత్రమేనన్నారు. ఎవరితో ఎవరు ఉన్నారో తేల్చుకుందాం రండి అంటూ బీజేపీకి సవాల్‌‌ విసిరారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌తో కలిసి ఆదివారం కరీంనగర్‌‌ డీసీసీ ఆఫీస్‌‌లో మీడియాతో మాట్లాడారు. బీసీల గురించి అనేక మాటలు చెప్తున్న బీజేపీ లీడర్లు.. బీసీ రిజర్వేషన్లపై తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌‌ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేస్తారా ? చేయరా ? అని ప్రశ్నించారు. 

ఉద్యోగాల కల్పనకు జాబ్‌‌ క్యాలెండర్‌‌ ప్రకటించామని, ఇప్పటికే 56 వేల ఉద్యోగాలను సైతం భర్తీ చేశామని చెప్పారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, స్పౌజ్‌‌ కేసులను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. గ్రాడ్యుయేట్లంతా కాంగ్రెస్‌‌ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. సమావేశంలోఎమ్మెల్యేలు డాక్టర్‌‌ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్‌‌ ఇన్‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌రావు, నాయకులు వొడితల ప్రణవ్‌‌బాబు, కేకే. మహేందర్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సంగీతం శ్రీనివాస్, ఎండీ తాజుద్దీన్, సమ్మద్ నవాబ్ పాల్గొన్నారు.