
- అక్కడ పీకాక్, బఫెలో లేక్ లు లేవు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమిపై తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆ భూమిని 2003లో క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించిందని, కానీ, ఐఎంజీ ప్రాజెక్ట్ను ప్రారంభించకపోవడంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధలన ఉల్లంఘన జరిగినట్టు గుర్తించి కేటాయింపును రద్దు చేసిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల భూమిలో బఫెలో లేదా పీకాక్ లేక్ వంటి ప్రకృతి ప్రాంతాలు ఏవీ లేవని రెవెన్యూ శాఖ స్పష్టం చేసిందన్నారు. ఆ భూమిలోని రాతి నిర్మాణాలు, పుట్టగొడుగు ఆకారంలోని రాళ్లను గ్రీన్ జోన్గా ఏర్పాటు చేస్తామని టీజీఐఐసీ ప్రకటించిందన్నారు. అందుకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ ప్రణాళికనూ సిద్ధం చేసి అమలు చేస్తుందన్నారు. హెచ్సీయూ భూములనూ ఆక్రమించలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.