ఏఐ రెండంచుల కత్తి.. ఎంత అభివృద్ధో.. అన్ని సవాళ్లు

ఏఐ రెండంచుల కత్తి.. ఎంత అభివృద్ధో.. అన్ని సవాళ్లు

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) రెండంచుల కత్తిలాంటిదని, దాని వల్ల ఎంత పురోగతి సాధించవచ్చో.. అన్ని సవాళ్లు కూడా ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. ఏఐతో ఆర్థికాభివృద్ధి సాధించడం ఒక్కటే తెలంగాణ లక్ష్యం కాదని, ఏఐని విశ్వసనీయ, పారదర్శక, విలువలతో కూడిన టూల్​గా మార్చాలన్నదే తమ టార్గెట్​ అని పేర్కొన్నారు. 

అన్ని రంగాల్లోనూ అందరికీ సమాన ఫలాలు పంచి, ఏఐని ప్రజలందరికీ చేరువచేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం రెండోరోజు ఏఐ గ్లోబల్​ సమిట్​లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. పారిశ్రామికాభివృద్ధికి క్షేత్ర స్థాయిలో ఏఐ ఇన్షియేటివ్స్​ను అమలు చేసి, సమూలమైన మార్పులు తీసుకొస్తామని చెప్పారు.  ప్రతి పౌరుడికీ దాని ఫలాలు అందినప్పుడే ఏఐతో విజయం సాధించినట్టవుతుందని తెలిపారు.

ట్రిలియన్​డాలర్ల ఆర్థిక వ్యవస్థకు వ్యూహాలు

లక్ష కోట్ల డాలర్ల (ట్రిలియన్​ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగేందుకు మూడు వ్యూహాలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్​ బాబు వెల్లడించారు. ‘‘సెంటర్స్​ ఆఫ్​ ఎక్సలెన్స్ (సీవోఈ)​ను ఏర్పాటు చేసి.. సైబర్​ సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, ఆర్థిక రంగాల్లో మరింత వృద్ధిని సాధించేందుకు సరికొత్త ఆవిష్కరణలను తీసుకొస్తాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏఐ ఇన్నొవేషన్​ సెంటర్లను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలోని ప్రతి మూలకు ఏఐ ఆధారిత అభివృద్ధిని చేరవేస్తాం. 

పట్టణ, గ్రామీణ ప్రాంతాలను ఏకం చేసి, కొత్త అవకాశాలను సృష్టిస్తాం. ఏఐ విశ్వసనీయత: పారదర్శకత, బాధ్యతాయుతమైన, నైతికతతో కూడిన ఏఐని డెవలప్​ చేసి, ఏఐ ఆధారిత పాలనను అందించేందుకు సమగ్రమైన విధివిధానాలను రూపొందిస్తాం. బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలను ప్రమోట్​ చేయడం ద్వారా ప్రజల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి శ్రీధర్​బాబు పేర్కొన్నారు.

ఏఐ సిటీకి అదో మైలు రాయి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏఐ సిటీలో డబ్ల్యూటీసీ (వరల్డ్​ ట్రేడ్​ సెంటర్) క్యాంపస్​ ఏర్పాటు అత్యంత కీలకమైన మైలు రాయి అని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. ఐటీ ఎగుమతులను 3,200 కోట్ల డాలర్ల నుంచి 20 వేల కోట్ల డాలర్లకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అది జీవం పోస్తుందని చెప్పారు. అంతర్జాతీయస్థాయి భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని సాధించాలన్న లక్ష్యంలో తెలంగాణ కమిట్​మెంట్​కు డబ్ల్యూటీసీతో అగ్రిమెంట్​ నిదర్శనమని స్పష్టం చేశారు.

 అంతర్జాతీయ స్థాయి సంస్థలు డిజిటల్​ టెక్నాలజీలకు ఐటీ బడ్జెట్​ను మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నదని చెప్పారు. రాష్ట్ర ఏఐ ప్రయాణంలో ప్రస్తుతం నిర్వహించిన ఏఐ గ్లోబల్​ సమిట్​ఓ మైలురాయిలా నిలిచిపోతుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఏఐ ఫలాలు అంది, రాష్ట్ర ఆర్థిక ప్రగతి మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.