సీడీసీ పోస్ట్​పై పీటముడి

సీడీసీ పోస్ట్​పై పీటముడి
  • సీడీసీ చైర్మన్ పోస్టుకు పోటీపోటీ
  • సిఫారసు లేఖలతో ఎవరికి వారు ప్రయత్నం
  • అధికార పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలు
  •  రెండు నెలలుగా ఆగిన నియమాకం

నామినేటేడ్​ పోస్టుల కేటాయింపుల్లో గందర గోళం నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా నామినేటెడ్​ పోస్టుల భర్తీ పక్రియ ఆలస్యమవుతోంది.  అడ్లూరు ఎల్లారెడ్డి సుగర్​ ఫ్యాక్టరీ సీడీసీ చైర్మన్​ పోస్టుకు ఇద్దరు ముఖ్య నేతలు సిఫారసు​ లేఖలు ఇవ్వడంతో చర్చనీయాంశమైంది. 

కామారెడ్డి, వెలుగు : సీడీసీ పోస్టుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారుడు వేర్వేరుగా సిఫారసు చేయడంతో చైర్మన్​ నియామకాన్ని మంత్రి నిలిపివేశారు.   రాష్ర్టంలో పదేండ్ల తర్వాత కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చింది.  ఆ పార్టీ ద్వితీయ శ్రేణి లీడర్లు, కార్యకర్తలు  పదవులపై ఆశ పెట్టుకున్నారు. 

 ముఖ్యంగా నామినేటెడ్​ పోస్టులకు డిమాండ్​ఎక్కువగా ఉంది.  జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు రాష్ర్ట స్థాయి కార్పొరేషన్​ పదవులు ఆశిస్తుండగా, మరి కొందరు జిల్లా స్థాయి,  ఇతర పోస్టులను ఆశిస్తున్నారు.  జిల్లాలో కొన్ని నామినేటెడ్​ పోస్టులను భర్తీ చేశారు. మార్కెట్​ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల పోస్టులు భర్తీ కాగా మరికొన్ని పెండింగ్​లో ఉన్నాయి.   జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.  

కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలు పూర్తిగా జిల్లా పరిధిలో ఉండగా  బాన్సువాడ నియోజక వర్గం  కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాల పరిధిలోకి వస్తుంది.   బాన్సువాడ నియోజక వర్గానికి చెందిన కాసుల బాల్​రాజుకు స్టేట్​కార్పొరేషన్​ పదవి దక్కింది.  కామారెడ్డి నియోజక వర్గానికి చెందిన డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు,  అడ్వకేట్​ దేవరాజ్​గౌడ్​, ఇంద్రాకరణ్​రెడ్డి కార్పొరేషన్​ చైర్మన్​పదవులు ఆశిస్తున్నారు.   

సీడీసీ చైర్మన్​ పదవి కోసం..  

జిల్లాలో  సదాశివనగర్​ మండలం  అడ్లూర్​ ఎల్లారెడ్డి,  నిజాంసాగర్​ మండలం మాగిలో షుగర్​ ఫ్యాక్టరీలు ఉన్నాయి.  ఈ ఫ్యాక్టరీల పరిధిలో   కేన్​ డెవలప్​మెంట్​​కౌన్సిల్(సీడీసీ)  ఉంటుంది.   ఇప్పటికే  మాగి సీడీసీ చైర్మన్​ పదవి భర్తీ అయ్యింది.  సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డి పరిధిలోని షుగర్​ ఫ్యాక్టరీ సీడీసీ పాలక వర్గం ఇంకా నియమాకం జరగలేదు.  ఈ ఫ్యాక్టరీ పరిధి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో ఉంటుంది. 

 ఫ్యాక్టరీ ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఉన్నందున   ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు  పాలక వర్గం నియమాకం కోసం ఆగస్టు చివరి వారంలో రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుకు సిఫారస్సు లేఖ ఇచ్చారు.  చైర్మన్​గా  మహ్మద్​ ఇర్షాద్, డైరెక్టర్లుగా మరో ఇద్దరు పేర్లు  ఇచ్చి వారిని నియమించాలని కోరారు.  కొద్ది రోజులకు సీడీసీ చైర్మన్​గా  కామారెడ్డి నియోజక వర్గం దోమకొండ మండలానికి చెందిన  అనంతరెడ్డి ని నియమించాలని కోరుతూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ మరో  లేఖ మంత్రికి ఇచ్చారు.  

 ఒకే పోస్టుకు ఇద్దరు ముఖ్య నేతలు సిఫారస్సు లేఖలు ఇవ్వటంతో  సీడీసీ పాలకవర్గ నియామకం నిలిచిపోయింది.   షబ్బీర్​అలీ, మదన్​మోహన్​రావుల మధ్య  కొన్నాళ్లుగా రాజకీయ విభేదాలు ఉన్నాయి.   వీరిద్దరూ చర్చించుకొని ఒకరిని సూచిస్తేనే పాలక వర్గం నియామకం జరుగుతుందని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. 

 జుక్కల్​ నియోజక వర్గంలో  ఎస్సీ సెల్​ ఇన్​చార్జీ నియామకం విషయంలోనూ  విభేదాలు బయటపడ్డాయి.   ఇన్​చార్జిగా  సౌదగర్​ అరవింద్​ను పార్టీ నియమించగా,  ఆ తర్వాత  పార్టీ నుంచి సస్పెండ్​ చేశామని డీసీసీ ప్రెసిడెంట్​ ప్రకటించారు.  జుక్కల్​ ఎమ్మెల్యే సూచనతోనే  డీసీసీ ప్రెసిడెంట్​ ప్రకటన చేశారని అరవింద్​ విమర్శించారు.

ఎమ్మెల్యేలు రాలే

జిల్లా లైబ్రరీ చైర్మన్​గా  మద్ది చంద్రకాంత్​రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. జిల్లాకు చెందిన ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవటం చర్చనీయాంశమైంది.  ఇలా అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ పదవులు ఆశించినవారికి నిరాశ ఎదురవుతోందని ద్వితీయ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు.