11లోపు పనులు పూర్తి కావాలి : తుమ్మల నాగేశ్వర రావు

11లోపు పనులు పూర్తి కావాలి : తుమ్మల నాగేశ్వర రావు
  • పండుగ రోజు ప్రకాశ్​నగర్ ​బ్రిడ్జి వద్ద డైవర్షన్​ రోడ్డును ప్రారంభించాలి 
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం టౌన్, వెలుగు : దసరా పండుగ నుంచి ప్రకాశ్​నగర్ బ్రిడ్జి దగ్గర పాత లో లెవల్ క్యాజ్ వే డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలని, పనులను ఈనెల11లోపు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు సూచించారు. గురువారం ఖమ్మం పట్టణంలోని 28వ డివిజన్ ప్రకాశ్​ నగర్ లో ఆయన పర్యటించారు. టీయూఎఫ్​ఐడీసీ నిధులు రూ.1.90కోట్లతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదల కారణంగా దెబ్బతిన్న ప్రకాశ్​నగర్ బ్రిడ్జిని యథాస్థితికి తీసుకొని వచ్చేందుకు గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు, ఆర్ అండ్ బీ డీఈ చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

రఘునాథపాలెం మండలంలో పర్యటన..  

రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అడిషనల్​కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తో కలిసి మంత్రి తుమ్మల పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. వీవీ పాలెంలో ట్రాన్స్ ఫార్మర్ త్వరగా ఏర్పాటు చేయాలని

చింతగుర్తిలో ఉన్న విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ను ఆదేశించారు.  మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.