క్వింటాకు రూ.500: రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్

క్వింటాకు రూ.500: రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్

హైదరాబాద్: ఇటీవల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్‎పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుండే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 16) ఉత్తమ్ అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన సబ్ కమిటీ.. రేషన్, హెల్త్ కార్డుల జారీ విధివిధానాలపై డిస్కస్ చేసింది. 

ఈ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సన్న వడ్లకు బోనస్‎పై ప్రకటన చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ నుండే రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సన్న వడ్లకు క్వింటాలకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటు వస్తోన్న సర్కార్.. తాజాగా సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనతో  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.