
- అన్ని రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటి నిల్వ
- సెక్రటేరియెట్లో ఉన్నత అధికారులతో మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నాటికి రిజర్వాయర్లన్నింటినీ పూర్తి చేసి నీటిని నిల్వ చేసి పంటలకు నీళ్లివ్వాలని నిర్ణయించింది. శనివారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియెట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ఫేజ్1 పనులను ప్రాధాన్యపరంగా చేపట్టాలని, డిసెంబర్ నాటికి ఆ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కరివెన రిజర్వాయర్ వరకు పెండింగ్ ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ 3లో భాగంగా నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య కాల్వ పనులను వెంటనే ప్రారంభించాలని, అక్టోబర్లోపు ఆ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
నార్లాపూర్(6.4 టీఎంసీలు), ఏదుల (6.55), వట్టెం (16.70 టీఎంసీలు), కరివెన (19 టీఎంసీలు) రిజర్వాయర్ల పనులను టైమ్కు పూర్తి చేయాలని, డిసెంబర్ నాటికి ఆయా రిజర్వాయర్లలో వాటి పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 50 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు నార్లాపూర్, ఏదుల, వట్టెం పంపింగ్ స్టేషన్లకు 400 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణానికిగానూ ట్రాన్స్కోకు రూ.262 కోట్ల నిధులను మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
జులై నాటికి పంప్హౌస్లలో షెడ్యూల్ చేసిన మోటార్ల డ్రైరన్ను పూర్తి చేయాలన్నారు. కాగా, జూరాల ప్రాజెక్టును మునుపటి పూర్తి స్థాయి సామర్థ్యానికి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. పూడిక తీసి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం అయిన 12 టీఎంసీలకు పునరుద్ధరించాలన్నారు.