
మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ల కు నిరసన సెగ తగిలింది. మంత్రుల తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వ్యవహారంలో మంత్రులు వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు.
జూన్ 30వ తేదీ శుక్రవారం మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లతో కలిసి గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. అయితే పట్టాల పంపిణీ పూర్తయ్యాక మంత్రులను కలిసేందుకు జర్నలిస్టులు ప్రయత్నించారు. గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులు కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్నారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై, తమకిచ్చిన హామీలపై మంత్రులకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే మంత్రి కేటీఆర్ కావాలనే తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. దీంతో జర్నలిస్టులంతా కలిసి నిరసన తెలిపారు.