
న్యూఢిల్లీ: పహల్గాంలో టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. మెడికల్ వీసాలకు ఏప్రిల్ 29 వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందని పేర్కొంది. ఆ వీసాపై ఇండియాలో ఉన్నవాళ్లు ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని సూచించింది. కొత్త వీసాల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. పాక్ లో ఉన్న ఇండియన్లకూ పలు సూచనలు చేసింది.
ఆ దేశంలో ఉన్న వాళ్లు వీలైనంత త్వరగా వచ్చేయాలని, పాకిస్థాన్కు ప్రయాణాలు చేయవద్దని ఇండియన్స్కు సూచించింది. కాగా, పహల్గాం దాడిపై చర్చించేందుకు జర్మనీ, జపాన్, పోలండ్, యూకే, రష్యా, చైనా రాయబారులతో విదేశాంగ శాఖ అధికారులు ఢిల్లీలో సమావేశమయ్యారు. దాడి వివరాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించి మద్దతు కోరారు. పాకిస్థాన్కు చెందిన లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొంది.
భారత్పై పాకిస్థాన్ ఆంక్షలు
ఇండియా నిర్ణయాలపై పాక్ స్పందించింది. ఇస్లామాబాద్లో జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. వాఘా సరిహద్దును మూసివేయాలని, సిక్కు యాత్రికులు మినహా ఇండియన్స్కు సార్క్ వీసాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇస్లామాబాద్లోని ఇండియన్ ఎంబసీలో సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించింది. భారత్ హైకమిషన్లోని మిలటరీ అడ్వైజర్లు ఏప్రిల్ 30లోగా వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇండియాలో అన్ని రకాల బిజినెస్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియా విమానాలు పాక్ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామని పేర్కొన్నది.